- సమ్మె విరమించిన మెడికోలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత 28 రోజులుగా ఆందోళన బాటపట్టిన ఆయుష్ మెడికోలు సమ్మెను విరమించారు. అల్లోపతి వైద్యులతో సమానంగా తమకు స్టైపెండ్ చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో నిరసన తెలుపుతున్న ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల జేఏసీ ప్రతినిధులు శనివారం సెక్రటేరియెట్లో హెల్త్ మినిస్టర్ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆయన చాంబర్లో కలిశారు. మెడికోల న్యాయమైన డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించి, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు తెలంగాణ ఆయుష్ జేఏసీ అధికారికంగా ప్రకటించింది.
అల్లోపతి వైద్యులతో సమానంగా తమకు సమాన స్టైపెండ్ ఇవ్వాలని గత 28 రోజులుగా నిరసనలు తెలిపిన ఆయుష్ మెడికోలు. ఆయుష్ జేఏసీ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేశ్ మాట్లాడుతూ విద్యార్థుల కష్టాలను గుర్తించిన మంత్రి దామోదర్.. స్టైపెండ్ పెంచేందుకు ఉత్తర్వులు త్వరలోనే విడుదల చేస్తామని భరోసా ఇచ్చారన్నారు. మంత్రి ఇచ్చిన హామీతో సమ్మెను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నామని, తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని జేఏసీ నేతలు ప్రకటించారు.
