‘8 వసంతాలు’ చిత్రంతో నటిగా తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకుంది మలయాళ నటి అనంతిక సనీల్ కుమార్. ఆమె నటించిన తాజా చిత్రం ‘రోమాంచకం’. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.
వేణుగోపాల్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనంతిక మాట్లాడుతూ ‘‘8వసంతాలు’ తర్వాత ఎన్నో కథలు విన్నా. ఈ కథ మాత్రం బాగా ఎక్సయిట్ చేసింది. ఇందులో నేను బబ్లీ గర్ల్గా సరదాగా ఉండే పాత్రలో నటించా. ఇలాంటి క్యారెక్టర్లో నటించాలనేది నా డ్రీమ్. యూత్ ఆడియన్స్ బాగా రిలేట్ అయ్యే చిత్రమిది. ప్రేమతో పాటు హాస్యం, ఉత్కంఠ కూడా ఉంటాయి.
ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. సుమంత్ ప్రభాస్కు, నాకు మధ్య వచ్చే సీన్స్ నేచురల్గా ఉంటాయి. కొన్ని సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశా. నటిస్తున్నప్పుడే ఒక హ్యాపీనెస్ కలిగింది. అలాంటి జాయ్ను ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. సందీప్ రెడ్డి వంగా గారి బ్యానర్లో నటించడం గౌరవంగా భావిస్తున్నా. ప్రస్తుతం - తమిళంతో పాటు మలయాళం, తెలుగులో నటిస్తున్నా. భాషా భేదం లేకుండా ఎక్కడ అవకాశాలు వస్తే ఆ మూవీస్ చేస్తూ వస్తున్నా’ అని చెప్పింది.
