కోల్బెల్ట్/ నస్పూర్, వెలుగు: సింగరేణి కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో తమ సంఘం ముందుంటుందని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడువాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏఐటీయూసీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. కార్మికుల ఆర్థిక, ఉద్యోగ, వైద్య, విద్య, సంక్షేమానికి సంబంధించిన 24 అంశాలపై సింగరేణి యాజమాన్యంతో ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.
13 ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న పెర్క్స్పై ఆదాయపు పన్ను రీఫండ్ను తాజా అగ్రిమెంట్లో సాధించామని చెప్పారు. సహజంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు అదనంగా రూ.20 లక్షలు అందించడం, సీనియర్ మైనింగ్ సర్దార్లుగా పని చేస్తున్న అర్హులైన ఉద్యోగులకు సకాలంలో ఫోర్మెన్ ప్రమోషన్లు కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. మారుపేర్ల సమస్యకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారని, 2012 నుంచి పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్ల పునరుద్ధరణ, పెండింగ్ క్యాడర్ స్కీమ్ల అమలు, ఖాళీ పోస్టుల భర్తీ తదితర 24 సమస్యలు పరిష్కరించేలా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.
తాము యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవడాన్ని ఓర్వలేక టీబీజీకేఎస్ లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల నుంచి వసూలు చేసిన చందా డబ్బులు పంచుకోవడంలో టీబీజీకేఎస్ లీడర్లు కొట్లాడుకొని జైలుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. యూనియన్లీడర్ల అవినీతి, అక్రమాలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కోల్బెల్ట్ ఏరియాలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు కేసీఆర్కు ఫిర్యాదు చేస్తే, గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపేశారని తెలిపారు. యూనియన్ నాయకులు సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, భీమనాదుని సుదర్శనం, సోమిశెట్టి రాజేశం, కంది శ్రీనివాస్, పెద్దపల్లి బానయ్య, ఎగ్గెటి రాజేశ్వర్రావు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ లోని నరసయ్య భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
