సిరిసిల్ల టౌన్, వెలుగు: క్షుద్ర పూజలు, మంత్రాలు, చేతబడుల పేరుతో నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.30.50 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, క్షుద్ర పూజలకు ఉపయోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ఎస్పీ మహేశ్ బి. గితే వెల్లడించారు. కరీంనగర్కు చెందిన తురుపాటి శ్యామ్కుమార్ హైదరాబాద్ తూముకుంటలో భద్రకాళి పూజా స్టోర్ నిర్వహిస్తున్నాడు.
వేములవాడ అర్బన్ మండలం అగ్రహారానికి చెందిన పత్తెం లక్ష్మీరాజంతో అతడికి పరిచయం ఉంది. లక్ష్మీరాజం క్షుద్ర పూజలు చేస్తానని చెప్పడంతో ఇద్దరూ కలిసి డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. ఈక్రమంలో జనవరిలో శ్యామ్కుమార్ను హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఓ మహిళ కలిసి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పగా, క్షుద్ర పూజలతో వ్యాధి నయం చేస్తామని నమ్మించాడు.
లక్ష్మీరాజం పెద్ద పూజారి అని చెప్పి ఆమెను అతడి వద్దకు తీసుకెళ్లాడు. సిరిసిల్లలో పూజల పేరుతో నమ్మించి రూ.10 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత యాదగిరిగుట్ట వద్ద రూ.21 లక్షలు, కాశీలో రూ.13 లక్షలు ఇలా విడతల వారీగా సుమారు రూ.62 లక్షలు వసూలు చేశారు. ఆమెతో తెల్ల కాగితాలపై సంతకాలు కూడా చేయించుకున్నారు. తన ఆరోగ్యం నయం కాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితురాలు అడగగా.. క్షుద్ర పూజలు, చేతబడులతో ఆమెను, కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు.
అలాగే ఆమె పొలంలో గుప్త నిధులు వెలికి తీసి ఇస్తామని నమ్మించారు. ఈ నెల 23న డబ్బులు తిరిగి ఇస్తామని సిరిసిల్ల పాత బస్టాండ్కు రావాలని చెప్పి అక్కడికి రాకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేశ్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
