పోలీసులపై రాళ్ల దాడి… గాల్లోకి కాల్పులు

పోలీసులపై రాళ్ల దాడి… గాల్లోకి కాల్పులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవలగూడెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. కాల్పుల్లో చనిపోయిన దళ కమాండర్ లింగన్న మృతదేహాన్ని తరలిస్తుండగా అడ్డుకుని పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

మావోయిస్టుల వారోత్సవాల సందర్బంగా.. గుండాల అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఆ సమయంలో లింగన్న దళం పోలీసులకు ఎదురుపడటంతో.. ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో న్యూడెమోక్రసీ దళ కమాండర్ లింగన్న చనిపోగా.. బయ్యారం దళ కమాండర్ గోపి, గుండాల దళ కమాండర్ నరేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల్లో చనిపోయిన లింగన్న ముప్పై ఏళ్లు అజ్ఞాత దళంలో పనిచేస్తున్నట్లు సమాచారం.