బషీర్బాగ్, వెలుగు: జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. ఢిల్లీలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి చేసి, వారిపైనే అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి బషీర్బాగ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై వేధింపులు ఆపాలని, అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు.
ఐజేయూ మాజీ జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. పాత్రికేయుల గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రజాస్వామ్య దేశంలో సహించబోమన్నారు. బాధిత జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా మీడియా సమాజం అండగా ఉంటుందని తెలిపారు. జర్నలిస్టు సంఘాల నాయకులు వై.నరేందర్రెడ్డి, కె.సత్యనారాయణ, శ్రీకాంత్రెడ్డి, వాజిద్ అలీ, మహమ్మద్ అలీ, కిరణ్గౌడ్, ఎ.అనిల్కుమార్, శిగ శంకర్గౌడ్, మహిళా హక్కుల జాతీయ నాయకురాలు సంధ్య, సామాజికవేత్త సజయ తదితరులు పాల్గొన్నారు.
