హైదరాబాద్ షేక్ పేటలో విషాదం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. 17 రోజులుగా మృత్యువుతో పోరాడి ఇవాళ ప్రాణాలు వదిలాడు.
డిసెంబర్ 8న శరత్ అనే ఐదు నెలల బాలుడిని గుడిసెలో పడుకోబెట్టి పనులకు వెళ్లారు తల్లిదండ్రులు. తర్వాత వచ్చి చూసే సరికి బాలుడు ఏడుస్తూ కనిపించాడు. బాలుడిని వెంటనే తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వారు నిలోఫర్ కు తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. 17 రోజులుగా చికిత్స పొందుతున్న బాలుడు శరత్ ఇవాళ మృతి చెందాడు. వీధి కుక్కలు దాడి చేసినట్లు పోలీసులు సీసీ కెమెరాలో గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులు అనూష ,అంజి కూలిపనులు చేస్తున్నారు. చిన్నారి మృతితో కన్నీరుమున్నీరవుతున్నారు.