హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కూకట్ పల్లి జె ఎన్ టి యు దగ్గర ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య దృష్ట్యా లాక్ డౌన్ ను కొనసాగిస్తుందని, కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని ..అనవసరంగా రోడ్లపైకి రావద్దని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్స్ తో పాటు హైదరాబాద్ లో జన సాంద్రత ఎక్కువగా ఉన్న క్రమంలో కఠినంగా పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారని.. అనవసరంగా రోడ్లపైకి వస్తున్నా వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. అంబులెన్సులు, ఎసెన్షియల్ వెహికల్స్, డాక్టర్స్, పారా మెడికల్ సిబ్బంది , వ్యాక్సినేషన్ కి వెళ్లే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.