ధన్వాడ, వెలుగు : మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల స్కూల్లో టెన్త్ చదువుతున్న ఓ విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. ప్రిన్సిపాల్ రాజారం, పీడీ రామ్మోహన్ గౌడ్ కథనం ప్రకారం..మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం బుడుమతండాకు చెందిన ఎం.శ్రీకాంత్(15) కొండాపూర్ గురుకులంలో పదో తరగతి చదువుతున్నాడు.
శుక్రవారం ఉదయం శ్రీకాంత్ తోటి స్టూడెంట్స్తో కలిసి టిఫిన్ చేశాడు. తర్వాత ప్లేట్ను పై అంతస్తులో ఉంటున్న తన గదిలో ఉంచి మెట్లు దిగుతూ కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు అక్కడి స్టాఫ్కు చెప్పగా వెంటనే ధన్వాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పరీక్షించిన డాక్టర్లు నారాయణపేట దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్సులో అక్కడికి తీసుకువెళ్లగా గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి హాస్పిటల్కు వెళ్లి శ్రీకాంత్కుటుంబసభ్యులను పరామర్శించారు.