
మహబూబ్ నగర్, అలంపూర్, వెలుగు: కూతురు పెళ్లికి అప్పు దొరక్కపోవడంతో ఓ తండ్రి బలన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి (46) గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఫ్యామిలీతో ఉంటూ ఓ రెస్టారెంట్ లో పనిచేసేవాడు. కరోనా కారణంగా ఏడాది క్రితం ఉపాధి కోల్పోయాడు. తర్వాత కొన్నాళ్లు ఖాళీగా ఉన్న ఆయన కుటుంబం గడవడం కోసం చిన్నచిన్న హోటళ్లలో పనిచేస్తున్నాడు. పిల్లల చదువుల కోసం అప్పులు కూడా చేశాడు. కొద్దిరోజుల క్రితం తన కూతురుకు చిన్నంబాయి మండలం గుమ్మడానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరింది. వచ్చే నెల 20న ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే పెళ్లికి డబ్బులు లేకపోవడంతో మంగళవారం సొంతూరైన కొనేరుకు వచ్చి తెలిసిన వారిని అడిగాడు. కానీ, ఎవరి వద్దా డబ్బు దొరకకపోవడంతో బుధవారం రాత్రి పంటపొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య ఉదయశ్రీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం పెళ్లి బట్టలకు గద్వాలలో షాపింగ్ చేసేందుకు రమ్మని చెప్పాడని, ఇంతలోనే ఇలా జరిగిందని భార్య పిల్లలు రోదించారు.