
- అసెంబ్లీ ముందు జీహెచ్ఎంసీ వాహనం దగ్ధం
- శంషాబాద్ ప్లాస్టిక్ చైర్స్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం
- చిక్కడపల్లి త్యాగరాయగాన సభలో షార్ట్ సర్య్కూట్
బషీర్బాగ్, వెలుగు: అసెంబ్లీ ముందు రహదారిపై అగ్నిప్రమాదం జరిగింది. రోడ్లు శుభ్రం చేస్తుండగా, జీహెచ్ఎంసీ వాహనం నుంచి శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్ వాహనం నుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బందికి పోలీసులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
ప్లాస్టిక్ చైర్స్ పరిశ్రమలో..
శంషాబాద్ : మైలార్ దేవ్ పల్లి పరిధి శాస్త్రిపురం కాలనీలోని ప్లాస్టిక్ చైర్స్ పరిశ్రమలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలను గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని, రెండు ఫైర్ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
త్యాగరాయ గానసభలో..
ముషీరాబాద్: చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో ఆదివారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తు కళామారుతి వేదికలో అమృతవర్షిణి సంస్థ ఆధ్వర్యంలో పాటల ఆలాపన కార్యక్రమం ప్రారంభమైంది. మేకప్ రూమ్లో షార్ట్సర్క్యూట్జరిగి, మంటలు రావడంతో గాయకులు, ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేసరికే గానసభ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.