
- గతంలో పీకే టీమ్ లో పని చేసిన సునీల్ కనుగోలు
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను మొదలు పెట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. అందులో భాగంగా పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా కర్ణాటకకు చెందిన సునీల్ కనుగోలును నియమించనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని ఆయన తెలిపారు.
కాగా.. సునీల్ కనుగోలు గతంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) టీమ్ లో పనిచేశారు. పీకే కు చెందిన ఐ ప్యాక్ టీమ్ లో సభ్యుడిగా.. బీజేపీ, డీఎమ్కే, ఏఐడీఎమ్కే, అకాలిదళ్ పార్టీల విజయం కోసం ఆయన పని చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల పీకేతో విడిపోయిన సునీల్ కనుగోలు.. ‘మైండ్షేర్ అనలిటిక్స్’ పేరుతో కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీయే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహలను రచిస్తుంది.
గతంలో ప్రశాంత్ కిశోర్ ని కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా నియమించనున్నట్లు, ఆయన త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇవన్నీ నిజం కాదంటూ కాంగ్రెస్ కొట్టిపారేసింది. పీకేని కాదని ఆయన సన్నిహితుడు సునీల్ కనుగోలుకే ఓటేసింది కాంగ్రెస్. త్వరలో కర్ణాటకలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలు మొదలు.. 2024 పార్లమెంట్ ఎన్నికల వరకు.. కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి సునీల్ వ్యూహాలు రచించనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. దేశ వ్యాప్తంగా పార్టీకి జవసత్వాలు కల్పించడంతోపాటు.. రాహుల్ గాంధీ ఇమేజ్ ను పెంచే బాధ్యతలను సునీల్ భుజస్కంధాలపై మోపింది కాంగ్రెస్.
మరిన్ని వార్తల కోసం: