
హైదరాబాద్, వెలుగు: పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయంగా శనగ పప్పు(చనా) వినియోగాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ‘భారత్ దాల్’ బ్రాండ్ పేరుతో శనగపప్పు ప్యాకెట్లను అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం వద్ద ఉన్న శనగపప్పు స్టాక్లో 20 శాతాన్ని రిటైల్ సరఫరాగా మార్చి సబ్సిడీ ధరలకు అందించనుంది. ‘వన్ నేషన్ వన్ ప్రైస్’ విధానంలో భాగంగా వినియోగదారులకు శనగపప్పును సరసమైన ధరలకు అందుబాటులో తేనుంది. కేజీ శనగపప్పు ప్యాకెట్ రూ.60, 30 కిలోల ప్యాకెట్ కిలో రూ.55కు అందించనుంది.
భారత్ దాల్ పంపిణీలో ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కార్పొరేషన్లు, రాష్ట్ర హోం శాఖ, ఆర్మీ, సీఆర్పీఎఫ్, కేంద్రీయ భండార్ తదితర సంస్థలను కేంద్రం భాగస్వామ్యం చేసింది. రిటెయిలర్లు, హోల్సేల్ వ్యాపారులు, ప్యాక్స్, ఎస్హెచ్జీలు, ఎన్జీవోలు, రిటైల్ చైన్లు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు, ఇ–కామర్స్ సంస్థలు కూడా ఇందులో భాగం కానున్నాయి. హాస్పిటల్స్, సామూహిక వంటశాలలు (అక్షయ పాత్ర, రాష్ట్ర క్యాంటీన్లు) తదితర సంస్థలు భారత్ దాల్ను వినియోగించనున్నాయి. రాష్ట్ర నియంత్రణలో ఉన్న సహకార సంస్థలకు కేంద్రం 2 లక్షల టన్నుల శనగపప్పును కేటాయించింది.
హాకాకు 50 వేల టన్నులు..
రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన హైదరాబాద్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు 50 వేల టన్నుల శనగపప్పును కేంద్రం కేటాయించింది. దేశవ్యాప్తంగా18 రాష్ట్రాలలో ‘భారత్ దాల్’ బ్రాండ్ శనగపప్పు పంపిణీ బాధ్యతలను హాకాకు అప్పగించింది. సుమారు 5 వేల వాహనాల్లో ఈ శనగపప్పును వినియోగదారులకు సరఫరా చేయనున్నారు. రిటైలర్లు, హోల్సేల్ వ్యాపారులకు, ప్రాథమిక సహకార సంఘాలు(ప్యాక్స్), మెట్రో, రిలయన్స్, టాటా రిటైల్ చైన్ హైపర్ మార్కెట్లు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ వంటి ఇ-–కామర్స్ ప్లాట్ఫారమ్లకు హాకా నేరుగా సరఫరా చేయనుంది. హాకా పంపిణీ చేసే శనగపప్పును ఆదివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. నెక్లెస్రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద హాకా చైర్మన్ ఎం. శ్రీనివాస్రావు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.