- కుటుంబ సభ్యుల ఆరోపణలు అవాస్తవం: డీఎంఈ
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్ కె.సురేశ్ ఆత్మహత్యకు సీనియర్ల వేధింపులే కారణమని అతడి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు అవాస్తవమని శుక్రవారం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ తెలిపారు. సురేశ్ ఆత్మహత్యపై తాము ప్రాథమిక విచారణ చేశామని, సీనియర్లు వేధింపులకు పాల్పడ్డట్టు వచ్చిన ఆరోపణలపై విచారించామని, వ్యక్తిగత, అనారోగ్య కారణాల వల్లే సురేశ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తమ విచారణలో తెలిసిందని డీఎంఈ స్పష్టం చేశారు. సురేశ్తో పాటు ఎంబీబీఎస్ చదివిన, అతడి సన్నిహిత విద్యార్థులే సురేశ్ కు ఉస్మానియా జనరల్ సర్జరీ విభాగంలో సీనియర్లుగా ఉన్నారని వారితోనే ఇక్కడ సురేశ్ సన్నిహితంగా ఉంటున్నారని, వేధింపులకు ఆస్కారం లేదని డీఎంఈ వెల్లడించారు.
వృత్తి పరమైన ఒత్తిడి కూడా లేదు..
గతేడాది నవంబర్లో జరిగిన ఆలిండియా కోటా కౌన్సెలింగ్లోనే సురేశ్కు ఉస్మానియాలో జనరల్ సర్జరీ సీటు వచ్చిందని, సర్జరీకి బదులు జనరల్ మెడిసిన్ చేయాలని భావించి.. చివరి రౌండ్ వరకూ అతను ప్రయత్నించారని డీఎంఈ వెల్లడించారు. అయినా అతడికి జనరల్ మెడిసిన్ సీటు రాకపోవడంతో ఈ ఏడాది జనవరిలో ఉస్మానియా సర్జరీ విభాగంలో రిపోర్ట్ చేశారని తెలిపారు.
సురేశ్ జాయిన్ అయినప్పటి నుంచి 76 రోజులకు 52 రోజులు మాత్రమే అటెండ్ అయ్యాడని.. అందులో 3 రోజులు మాత్రమే నైట్ డ్యూటీ చేశాడని తెలిపారు. డ్యూటీల ఒత్తిడి కూడా అతడిపై లేదన్నారు. సురేశ్ తన ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. సురేశ్ ఆత్మహత్య అంశంలో విచారణకు కమిటీని నియమించామని వెల్లడించారు.

