- 29 రన్స్ తేడాతో అమెరికాపై విక్టరీ.. టీ20 వరల్డ్ కప్లో బోణీ
న్యూజిలాండ్ను నలిపేసి.. సౌతాఫ్రికాను వణికించి 250 ప్లస్ స్కోర్లను జోకుల్లా మార్చేసిన ఇండియా టీ20 వరల్డ్ కప్లో హాట్ ఫేవరెట్గా ల్యాండ్ అయింది. కానీ, తొలి మ్యాచ్లోనే పసికూన అమెరికా మన మొనగాళ్లను భయపెట్టింది. వాంఖడే గడ్డపై ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ను అమెరికా బౌలర్లు కకావికలం చేశారు. 46/4.. 77 /6 తో డీలా పడ్డ డిఫెండింగ్ చాంపియన్ల పతనం ఖాయమనుకున్న వేళ ముంబై మొనగాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (49 బాల్స్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్) విశ్వరూపం చూపించాడు.
వికెట్లు పడుతున్నా వెరవకుండా మై హూ నా అంటూ బాధ్యత తీసుకున్న సూర్య తన మార్కు 360-డిగ్రీల షాట్లతో జట్టుకు మంచి స్కోరు అందిచాడు. ఆపై అనూహ్యంగా జట్టులోకి వచ్చిన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ మహ్మద్ సిరాజ్(3/29) ఖతర్నాక్ పేస్తో అమెరికా బ్యాటర్ల నడ్డి విరిచేశాడు. ఫలితంగా అమెరికాను పడగొట్టిన టీమిండియా వరల్డ్ కప్ వేటను షురూ చేసింది.
టీ20 వరల్డ్ కప్లో ఇండియా బోణీ కొట్టింది. ఇండియా టాపార్డర్ను అమెరికా బౌలర్లు కకావికలం చేసినా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (84 నాటౌట్) విశ్వరూపం చూపించాడు. ఇండియా 20 ఓవర్లలో 161 రన్స్ చేయగా.. యూఎస్ 132 స్కోరు చేసి ఓడింది.
ముంబై: పేరున్న హిట్టర్లంతా తడబడిన వేళ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపించడంతో టీ20 వరల్డ్ కప్లో ఇండియా శుభారంభం చేసింది. తొలి రోజు శనివారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్లో 29 రన్స్ తేడాతో అమెరికాను ఓడించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్కు వచ్చిన ఇండియా 20 ఓవర్లలో 161/9 స్కోరు చేసింది. కెప్టెన్ సూర్యకు తోడు తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) ఫర్వాలేదనిపించారు. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్విక్ (4/25) సత్తా చాటాడు.
అనంతరం ఛేజింగ్లో యూఎస్ టీమ్ 20 ఓవర్లలో 132/8 స్కోరు చేసి ఓడింది. సంజయ్ కృష్ణమూర్తి (37), శుభం రంజనే (37), మిలింద్ కుమార్ (34) పోరాడారు. అర్ష్దీప్, అక్షర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూర్య ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ నెల 12న ఢిల్లీలో జరిగే తమ తర్వాతి మ్యాచ్లో నమీబియాతో ఇండియా పోటీ పడనుంది.
టాప్, మిడిల్ ఢమాల్
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. అమెరికా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్తో కట్టడి చేయగా.. ఫీల్డర్లు కూడా అద్భుతమైన క్యాచ్లతో వారికి అండగా నిలిచారు. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ (0) అలీ ఖాన్ వేసిన రెండో ఓవర్లోనే సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి డకౌట్వడంతో స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయింది. మరో ఓపెనర్ ఇషాన్, తిలక్ పవర్ ప్లేలో ఒకటి రెండు షాట్లతో ప్రతిఘటించారు. నేత్రవల్కర్ వేసిన మూడో ఓవర్లో తిలక్ 6, 4, 4తో స్పీడు పెంచగా.. అలీ ఖాన్ బౌలింగ్లో ఇషాన్ 4, 6తో టచ్లోకి వచ్చాడు. కానీ, సౌతాఫ్రికా సంతతికి చెందిన అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్విక్ అద్భుత స్పెల్తో ఇండియా బ్యాటింగ్ నడ్డి విరిచాడు.
ఆరో ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి ఇండియాకు షాకిచ్చాడు. రెండో బాల్కు ఇషాన్ అనవసర షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఓ షాట్ పిచ్ బాల్తో తిలక్ను బోల్తా కొట్టించిన షాడ్లీ వాన్ తర్వాతి బాల్కే స్లో బౌన్సర్తో మరో హిట్టర్ శివం దూబే (0)ను డకౌట్ చేశాడు. దాంతో పవర్ ప్లేను ఇండియా 46/4తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా ఇండియా బ్యాటింగ్లో పెద్దగా మార్పు రాలేదు. ఓ ఎండ్లో సూర్యకుమార్ పోరాడుతున్నా.. మిడిలార్డర్లో రింకూ సింగ్ (6), హార్దిక్ పాండ్యా (5) విఫలమవడంతో ఇండియా 77/6తో పీకల్లోతు కష్టాల్లో పడ్డది.
సిరాజ్ దెబ్బ
బ్యాటింగ్లో తడబడినప్పటికీ బాల్తో మాత్రం ఇండియా అద్భుతంగా పుంజుకుంది. ఛేజింగ్లో అమెరికాను ఇండియా పేసర్లు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తీశారు. కొత్త బాల్తో అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సిరాజ్ అత్యంత ప్రమాదకరంగా మారాడు. రెండో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన హైదరాబాదీ తన నాలుగో బాల్కే ఆండ్రీస్ గౌస్ (6)ను తిలక్ క్యాచ్తో ఔట్ చేసి ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ మోనాంక్ పటేల్ (0)ను అర్ష్దీప్ తన స్వింగ్తో బోల్తా కొట్టించి డకౌట్ చేశాడు. ఆ వెంటనే సాయితేజ (2)ను సిరాజ్ డగౌట్ చేర్చడంతో 13/3తో అమెరికా డిఫెన్స్లో పడిపోయింది.
ఈ టైమ్లో సంజయ్ కృష్ణమూర్తి, మిలింద్ కుమార్ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే బౌండరీలు కొట్టడంతో సగం ఓవర్లకు అమెరికా 63/3తో పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మిలింద్ స్టంపౌట్ కావడంతో నాలుగో వికెట్కు 58 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అయినా వెనక్కు తగ్గని సంజయ్.. అక్షర్, వరుణ్ ఓవర్లలో రెండు సిక్సర్లతో ఎదురుదాడికి దిగాడు. కానీ, 16వ ఓవర్లో వరుస బాల్స్లో సంజయ్తో పాటు హర్మీత్ సింగ్ (0)ను ఔట్ చేసిన అక్షర్ ఇండియా విజయాన్ని ఖాయం చేశాడు.
సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్
ఒకవైపు వికెట్లు పడుతున్నా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా తనదైన శైలిలో ఇన్నింగ్స్ను నిర్మించాడు. గ్రౌండ్ నలుమూలల తన ట్రేడ్ మార్కు షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి అక్షర్ పటేల్ (14) కొద్దిసేపు సహకరించాడు. నేత్రవల్కర్ వేసిన 16వ ఓవర్లో అక్షర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. సూర్య 4,6 బాది స్కోరు వంద దాటించాడు. తర్వాతి ఓవర్లో అక్షర్ను హర్మీత్ ఔట్ చేసినా సూర్య తన పోరాటాన్ని కొనసాగించాడు.
ఓ ఎండ్లో అర్ష్దీప్ సింగ్ (4)ను నిలబెట్టి షాట్లు ఆడాడు. శుభం బౌలింగ్లో ఫోర్తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతను షాల్క్విక్ వేసిన 19వ ఓవర్లో 4, 6 రాబట్టాడు. నేత్రవాల్కర్ చివరి ఓవర్లో వరుసగా 4, 6, 6, 4తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇందులో మోకాళ్లపై కూర్చొని స్కూప్ షాట్తో ఫైన్ లెగ్ మీదుగా కొట్టిన సిక్స్ తన ఇన్నింగ్స్కే హైలైట్ అనొచ్చు. లాస్ట్ ఓవర్లో 21 రన్స్ రావడంతో ఇండియా స్కోరు 160 దాటింది.
స్కోరుబోర్డు
ఇండియా ఇన్నింగ్స్: ఇషాన్ (సి) మిలింద్ (బి) షాడ్లీ 20, అభిషేక్ (సి) కృష్ణమూర్తి (బి) అలీ ఖాన్ 0, తిలక్ (సి) పటేల్ (బి) షాడ్లీ 25, సూర్యకుమార్ (నాటౌట్) 84, శివం దూబే (సి) నేత్రవల్కర్ (బి) షాడ్లీ 0, రింకూ సింగ్ (సి) మిలింద్ (బి) మొహ్సిన్ 6, హార్దిక్ (సి) సాయితేజ (బి) హర్మీత్ 5, అక్షర్ పటేల్ (సి) మోసిన్ (బి) హర్మీత్ 14, అర్ష్దీప్ (సి) మిలింద్ (బి) షాడ్లీ 4, చక్రవర్తి (రనౌట్) 0; ఎక్స్ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 161/9; వికెట్ల పతనం: 1–8, 2–45, 3–46, 4–46, 5–72, 6–77, 7–118, 8–140, 9–161. బౌలింగ్: సౌరభ్ నేత్రవల్కర్ 4–0–65–0, అలీ ఖాన్ 2–0–13–1, షాడ్లీ వాన్ షాల్క్విక్ 4–0–25–4, మోసిన్ 4–0–16–1, శుభమ్ రంజనే 2–0–16–0, హర్మీత్ సింగ్ 4–0–26–2.
అమెరికా ఇన్నింగ్స్: గౌస్ (సి) తిలక్ (బి) సిరాజ్ 6, సాయితేజ (సి) వరుణ్ (బి) సిరాజ్ 2, మోనాంక్ (సి) దూబే (బి) అర్ష్దీప్ 0, మిలింద్ (స్టంప్) ఇషాన్ (బి) వరుణ్ 34, సంజయ్ (సి) రింకూ (బి) అక్షర్ 37, రంజనే (ఎల్బీ) (బి) సిరాజ్ 37, హర్మీత్ (సి) సిరాజ్ (బి) అక్షర్ 0, మోసిన్ (సి) తిలక్ (బి) అర్ష్దీప్ 8, షాల్క్విక్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో132/8; వికెట్ల పతనం: 1–8, 2–11, 3–13, 4–71 , 5–98, 6–98, 7–110, 8–132; బౌలింగ్: అర్ష్దీప్ 4–0–18–2, సిరాజ్ 4–0–29–3, వరుణ్ 4–0–24–1, అక్షర్ 4–0–24–2, హార్దిక్ 4–0–34–0.
సిరాజ్ 557 రోజుల తర్వాత వచ్చి
టీమిండియా పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఏకంగా 557 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 టీమ్లో రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన వామప్ మ్యాచ్లో యువ ఆల్రౌండర్ హర్షిత్ రాణా మోకాలి గాయంతో టోర్నీ మొత్తానికి దూరం కావడంతో వరల్డ్ కప్ టీమ్లోకి వచ్చిన అతనికి పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం బారిన పడటంతో అనూహ్యంగా తుది జట్టులో ఆడే చాన్స్ కూడా లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్ మూడు వికెట్లతో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
