టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ల విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శ్రీలంకలో ఇండియా, పాక్ మ్యాచ్ లను షెడ్యూల్ చేసింది ఐసీసీ. అయినప్పటికీ.. తాము ఇండియాతో గేమ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు పాక్ ప్రకటించడంతో అప్పటి నుంచి అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి స్పందించాడు. తాము ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.
టోర్నమెంట్ కు ముందు ఏర్పాటు చేసిన కెప్టెన్స్ మీట్ సందర్భంగా.. పాక్ తో ఆడటానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. పాకిస్తాన్ ఆడటానికి సిద్ధంగా లేకున్నా తాము మాత్రం కొలంబో వెళ్తున్నట్లు స్పష్టం చేశాడు. అందుకోసం టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్లు తెలిపాడు.
మా మైండ్ సెట్ క్లియర్ గా ఉంది.. ఆడమని మేము చెప్పలేదు. అలా చెప్పింది వాళ్లు.. మా ఫ్లైట్స్ బుక్కయ్యాయి.. కొలంబో వెళ్తున్నాం.. ముందుగా యూఎస్ఏ, కెనడా తర్వాత కొలంబో కు వెళ్తాం.. అంటూ క్లారిటీ ఇచ్చాడు సూర్య.
పాకిస్తాన్ జట్టు తమ షెడ్యూల్డ్ గ్రూప్ మ్యాచ్లో పాల్గొనడంపై అనిశ్చితి ఉన్నప్పటికీ, రాబోయే T20 ప్రపంచ కప్ 2026 కోసం తమ జట్టు సన్నాహాలు మారలేదని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
►ALSO READ | బ్యాట్ పట్టుకోవటం తెలియని వాళ్లు క్రికెట్ కమిటీల్లో ఉంటారా.. ఉండాల్సింది మాజీ క్రికెటర్లు కదా
ఈ టోర్నమెంట్లో గ్రూప్ స్టేజ్ లో ఇండియా నాలుగు మ్యాచ్లు ఆడుతుంది . 2026 ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో తమ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న న్యూఢిల్లీలో నమీబియాతో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్ లు తర్వాత.. అత్యంత ఆసక్తి కలిగిన మ్యాచ్.. ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్తో జరగనుంది, ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్ తో గ్రూప్ మ్యాచ్ లు ముగుస్తాయి.
గ్రూప్ స్టేజ్ తర్వాత, ప్రతి గ్రూప్ నుండి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్ 8 కు చేరుకుంటాయి, అక్కడ వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆ గ్రూపుల నుండి టాప్ లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.
టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ జట్లు రెండూ ముందుకు సాగితే, ఫైనల్లో తిరిగి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అయితే, అలాంటి సందర్భంలో పాక్ పాల్గొంటుందా లేదా అనే దానిపై పాకిస్తాన్ వైఖరి ఇంకా అస్పష్టంగా ఉంది.
