‘మీరు మార్స్లో చిక్కుకుపోయినా సరే.. ఇండియన్ ఎంబసీ మీకు సాయం చేస్తుంది’.. ఇది విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ చెప్పిన మాట. మార్స్ మీద అనేది అతిశయోక్తిగా అనిపించినా ఆమె స్పందించే తీరు మాత్రం అక్షరాలా అదే. విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ మనసున్న అమ్మగా నిలిచారు. దేశ విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న ఇండియన్లు.. సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా సరే వెంటనే స్పందించి సాయం చేసేవారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారెందరినో ఇండియాకు క్షేమంగా రప్పించారు. హైదరాబాద్కు చెందిన సైదా మరియం అనే మహిళ ఖతార్లో చిక్కుకుపోతే ఇండియాలోని ఆమె తల్లి.. సుష్మాస్వరాజ్కు లెటర్ రాసి సమాచారమిచ్చారు. దానిపై వెంటనే స్పందించిన సుష్మా ఖతార్లోని ఇండియన్ ఎంబసీ అధికారులకు చెప్పి ఆమెను ఇండియాకు తిరిగి రప్పించారు. అదే తరహాలో ఒమన్లో చిక్కుకుపోయిన హైదరాబాదీ మహిళ కుల్సుం భానును రక్షించారు. ఉపాధి కోసం తెలంగాణ నుంచి సౌదీకి వెళ్లిన 29 మంది కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. వారి యజమాని 12 రోజులుగా తిండి, నీళ్లు ఇవ్వకుండా హింసిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేయడంతో సుష్మా స్పందించారు. నేరుగా సౌదీలోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడారు. ‘అక్కడి తెలంగాణ వర్కర్లకు వెంటనే సాయం చేయండి. వివరాలను నాకు, కేటీఆర్కు పంపండి’ అని ఎంబసీ అధికారి అహ్మద్ జావేద్ను ఆదేశించారు.
పెళ్లినాటికి ఇండియాలో ఉంటావ్..
గతేడాది అమెరికాలో ఉండే రవితేజ అనే ఇండియన్ యువకుడు పాస్పోర్ట్ పోగొట్టుకున్నాడు. మరో రెండు వారాల్లో అతడి పెళ్లి.. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ట్విట్టర్లో సుష్మా స్వరాజ్కు ట్వీట్ చేశాడు. ఆమె వెంటనే ఆ యువకుడికి ధైర్యం చెప్పారు. పెళ్లి సమయానికి ఇంట్లో ఉంటావంటూ భరోసా ఇచ్చారు.