ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో..ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్‌‌

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో..ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్‌‌
  • సుప్రీంకోర్టు ఆదేశించి వారం గడిచినా ఇండియాకు రాని ఎస్ఐబీ మాజీ చీఫ్
  • వన్‌‌ టైమ్ ఎంట్రీ కోసం అమెరికాలోని ఇండియన్​ఎంబసీలో దరఖాస్తు
  • సాంకేతిక సమస్యలు తలెత్తకపోతే సోమవారం విచారణకు హాజరయ్యే చాన్స్‌‌
  • ఆలస్యం చేస్తే మరోసారి సుప్రీంను ఆశ్రయించేందుకు సిట్​ఏర్పాట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్‌‌ కొనసాగుతున్నది. సిట్‌‌ విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చి వారం గడిచినా ప్రభాకర్ రావు ఇండియాకు రాలేదు. ఇండియాకు వచ్చేందుకు అవసరమైన వన్‌‌ టైం ఎంట్రీ కోసం ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌‌ జారీ చేయాలని అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో సోమవారం దరఖాస్తు చేసుకున్నాడు.

ఈ ప్రక్రియలో దరఖాస్తు అందిన రెండ్రోజుల తర్వాత అంటే బుధవారం లేదా గురువారం ప్రభాకర్ రావు చేతికి ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వన్‌‌ టైం ఎంట్రీ పాస్‌‌పోర్ట్‌‌పై ఇండియాకు వస్తాడు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుంటే ఆదివారం ఇండియాకు చేరుకుని ఈ నెల 9న విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సిట్‌‌ అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ అమెరికా ఇమ్మిగ్రేషన్‌‌ క్లియరెన్స్‌‌ విషయంలో జాప్యం జరిగితే ఆలస్యమయ్యే చాన్స్​ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌‌ తప్పనిసరి

వన్‌‌ టైమ్‌‌ ఎంట్రీ కోసం అవసరమైన ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌‌ జారీ అంశంలో ప్రభాకర్‌‌‌‌ రావు కావాలనే జాప్యం చేస్తున్నాడా? లేక ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా? అనే వివరాలు సిట్​అధికారులు సేకరిస్తున్నారు. గడువులోగా విచారణకు హాజరుకాకుండా ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

గతేడాది మార్చి10న పంజాగుట్ట పోలీస్‌‌స్టేషన్‌‌లో నమోదైన ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు  బెయిల్‌‌ కోసం సుప్రీంను ఆశ్రయించగా.. అరెస్ట్ చేయకుండా విచారించాలని గత గురువారం కోర్టు ఆదేశాలిచ్చింది. సిట్‌‌ విచారణకు పూర్తిగా సహకరిస్తానని ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్‌‌ పత్రాలు కూడా సమర్పించాడు.