
హైదరాబాద్: తెలంగాణకు మంచి జరుగుతుందంటే ఎవరి కాళ్లయినా పట్టుకుంటానని అన్నారు స్వామి పరిపూర్ణానంద. గురువారం ఇందిరా పార్క్ వద్ద మహిళ సంకల్ప దీక్ష చేపట్టిన బీజేపీ నేత డీకే అరుణ దీక్షను నేడు (శుక్రవారం) కొబ్బరి నీళ్లు ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమత,మానస, దిశ ల తో పాటు అత్యాచారాలకు గురైన మహిళలకై రెండు రోజుల నిరహార దీక్ష చేసిన డీకే అరుణ ఉక్కు సంకల్పం గొప్పదన్నారు. కడుపు మాడ్చుకుంటే కాని ప్రభుత్వానికి కనువిప్పు కల్గదని ఆమె తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు.
దిశ ఘటన గురించి మాట్లాడుతూ.. దిశ అనే యువతి భూమి మిదే నరకాన్ని చూసిందన్నారు. దిశ నిందితులది ఎన్ కౌంటర్ కాదని, సర్జికల్ స్ట్రైక్ అని అన్నారు. ఎన్ కౌంటర్ చేసింది పోలీసులు కాదన్నారు. ఆ ఎన్ కౌంటర్ ప్రజల తీర్పు అని చెప్పారు. ఈ ఘటనపై జనం నిరసన వ్యక్తం చేయడం వల్లే సజ్జనార్ బయటకు వచ్చాడన్నారు. హజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు పరిపూర్ణానంద.
ఘటన జరిగిన తర్వాత.. ఎవరికో ఫోన్ చేసే బదులు ఆ అమ్మాయి డయల్ 100 కి ఫోన్ చేయొచ్చు కదా అన్న హోం మంత్రి వ్యాఖ్యలను పరిపూర్ణానంద తప్పు బట్టారు. దిశ పాపం అంటకుండా ఉండాలంటే రాష్ట్రంలో మద్యాన్ని నిషేదించాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. అందుకోసం కేసీఆర్ కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని… మద్యాన్ని నిషేదించాలని అన్నారు. అత్యాచారాలకి ప్రధాన కారణం మద్యం అని, అవి జరగకుండా ఉండాలంటే తెలంగాణలో మద్యాన్ని నిషేదించాలని ఆయన అన్నారు. తెలంగాణను ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పారు.
కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వం సవరణ బిల్లుకు శివసేన వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు పరిపూర్ణానంద. హిందుత్వం కోసం పుట్టిన శివసేన పార్టీ సెక్యులరిజం చేతిలో బందీ అయ్యిందని ఆయన అన్నారు.