T20 World Cup 2024: సెమీ ఫైనల్ స్థానాలు ఖరారు.. మ్యాచ్‌లు ఎప్పుడంటే..?

T20 World Cup 2024: సెమీ ఫైనల్ స్థానాలు ఖరారు.. మ్యాచ్‌లు ఎప్పుడంటే..?

టీ20 వరల్డ్ కప్ చివరి దశకు వచ్చేసింది. 20 జట్లు కాస్త 4 జట్లయ్యాయి. సూపర్ 8 ముగియడంతో సెమీ ఫైనల్ స్థానాలు ఖరారయ్యాయి.  మంగళవారం (జూన్ 25) బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించడంతో సెమీస్ కు వెళ్లే నాలుగు జట్లేవో తేలిపోయాయి. గ్రూప్ 1 లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు అర్హత సాధించాయి. భారత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు సాధించింది. దీంతో టాప్ 2 లో నిలిచిన భారత్ (6), ఆఫ్ఘనిస్థాన్(4) జట్లు సెమీస్ పోరుకు సిద్ధమయ్యాయి. 

మరోవైపు గ్రూప్ 2 లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ఇప్పటికే సెమీస్ కు చేరాయి. ఈ గ్రూప్ లో సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచి 6 పాయింట్లతో  గ్రూప్ టాపర్ గా సెమీస్ స్థానం ఖాయం చేసుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు సాధించి 4 పాయింట్లతో సెమీస్ కు అర్హత సాధించింది. 20 జట్లతో ప్రారంభమైన ఈ టోర్నీలో ఇంగ్లాండ్, భారత్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. 

సెమీస్ లో ఎవరితో ఎవరు?
 
గ్రూప్-1లోని అగ్రశ్రేణి జట్టు గ్రూప్-2లో రెండో ర్యాంక్‌తో తలపడాలని, గ్రూప్-2లోని అగ్రశ్రేణి జట్టు గ్రూప్-1లో తలపడాలని ఇప్పటికే నిర్ణయించారు. దీని ప్రకారం గ్రూప్ 1 లో భారత జట్టు గ్రూప్ 2 లో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్ జరగనుంది. ఇక గ్రూప్ 2 లో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా గ్రూప్ 1 లో రెండో స్థానంలో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ పై సెమీస్ ఆడుతుంది. భారత కాలమాన ప్రకారం గురువారం (జూన్ 27) ఉదయం 8 గంటలకు ఆఫ్ఘనిస్తాన్ తో సౌతాఫ్రికా ఢీ కొట్టనుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు ఇంగ్లాండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది.