న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియా, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా సన్నాహాలపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ప్రిపరేషన్స్, ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో తాము ఉండాలనుకున్న స్థాయిలో ఇంకా లేమని గంభీర్ స్పష్టం చేశాడు. తమ ఫిట్నెస్ను మరో లెవెల్కు తీసుకెళ్లాలని ప్లేయర్లకు పిలుపునిచ్చాడు. ఒత్తిడితో కూడిన మ్యాచ్ల్లో గెలవాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యమని, ప్లేయర్లు గ్రౌండ్లో మరింత చురుగ్గా వేగంగా కదలాలని సూచించాడు.
‘మనం ఎంత ఫిట్గా ఉంటే, మానసికంగా అంత దృఢంగా ఉంటాం. మనం కోరుకున్న స్థాయికి చేరుకోవడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది’ అని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల ఆసియా కప్లో జస్ప్రీత్ బుమ్రాతో పవర్ప్లేలోనే మూడు ఓవర్లు వేయించడం జట్టు దూకుడుకు నిదర్శనమన్నాడు. జట్టు కేవలం దూకుడైన బ్యాటింగ్కే పరిమితం కాకుండా, బౌలింగ్లోనూ అలానే ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు.
అలాగే, టీమ్లో 7 నుంచి 8 బౌలింగ్ ఆప్షన్లు ఉండాలన్నదే తన టార్గెట్ అన్నాడు. అందుకే శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్రౌండర్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని గంభీర్ వెల్లడించాడు. కఠినమైన పరిస్థితుల్లో ఆటగాళ్లను పరీక్షించడం ద్వారా వాళ్ల నిజమైన సత్తాను అంచనా వేయవచ్చన్నది తన ఫిలాసఫీ అని గంభీర్ స్పష్టం చేశాడు.
