విభజన అంశాలపై అఖిల పక్షాన్ని కేంద్రం దగ్గరకు తీసుకెళ్లండి

విభజన అంశాలపై అఖిల పక్షాన్ని కేంద్రం దగ్గరకు తీసుకెళ్లండి
  • శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర విభజన హామీలు ఒక్కటీ అమలు కావడం లేదని.. అలాగే ఐటీఐఆర్ ప్రాజెక్టు కనుమరుగైపోయిందని శాసనమండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన సమాజం తెలంగాణ వచ్చినప్పటి నుంచి అత్యధికంగా నష్టపోతున్నదని ఆయన వివరించారు. కేంద్రం గిరిజనులకు 7.5శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే రాష్ట్రం మాత్రం 6 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోందన్నారు. కృష్ణా నదీ జలాల పంపిణీ సక్రమంగా జరగడం లేదన్నారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నా.. రాష్టానికి రావాల్సిన హక్కులను సాధించుకోలేకపోతున్నాడని పేర్కొన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ విషయంలో రాజ్యాంగ బద్దంగా మాట్లాడటం లేదని, తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారు అని ప్రధాని ఎలా అంటారు? అసలు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా బీజేపీకి ? అని ప్రశ్నించారు. 

విభజన అంశాల అమలు కోసం మీతో మేము ఉంటాం

విభజన అంశాల అమలు కోసం మీతో మేముంటామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు. విభజన అంశాలపై అఖిల పక్షం ఏర్పాటు చేసి కేంద్రం దగ్గరకు తీసుకు వెళ్లండి అని సూచించారు. బీజేపీ గురించి మాట్లాడకుండా టిఆర్ఎస్ చేతులెత్తేస్తోందన్నారు. మన రాష్ట్రానికి రావాల్సిన  హక్కుల విషయంలో కేంద్రంపై పోరాడేందుకు  మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భద్రాచలం పక్కన ఉన్న 7 గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్లో కానీ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా నిజామాబాద్ ఎమ్మెల్సీ గారు పసుపు బోర్డు పేరు ఎత్తుతారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్పందించి మాట్లాడుతూ పసుపు బోర్డు హామీ ఇచ్చిన వారిపై మీరు ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు. బీజేపీ మీద ఫైట్ అంటేనే టీఆర్ఎస్ వెనుకకు జరుగుతుందని జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అన్నారు.