చెన్నై: మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)కు వ్యతిరేకంగా రేపు తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించనున్నారు. నీట్ కు వ్యతిరేకంగా గత అన్నా డీఎంకే ప్రభుత్వం ఇలాంటి తీర్మానం చేసినా.. కేవలం నామాత్రంగా చేసి వదిలేసిందని డీఎంకే ఆరోపిస్తోంది. సీఎం స్టాలిన్ నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతున్నారు. ఈ మేరకు డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికల వాగ్దానం అమలులో భాగంగా రేపు అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఈ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత రాష్ట్రపతి నుంచి ఆమోదం కోసం తాము ఒత్తిడి తీసుకొస్తామని తమిళనాడు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ధీమా వ్యక్తం చేశారు. నీట్కు హాజరయ్యే విద్యార్థుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారని, ఈసారి అలా జరుగనివ్వమని ఆయన చెప్పారు.