ఏంటి విజయ్ ఈ స్పీడ్.. తమిళనాడు సీఎంగా డ్యూటీ ఎక్కిన కొన్ని గంటలకే..

ఏంటి విజయ్ ఈ స్పీడ్.. తమిళనాడు సీఎంగా డ్యూటీ ఎక్కిన కొన్ని గంటలకే..

చెన్నై: తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే జోసెఫ్ విజయ్ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. సమర్థులైన ఐఏఎస్ అధికారులను తన పక్కన పెట్టుకోవాలని సీఎం విజయ్ నిర్ణయించుకున్నారు.

తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ డా. పి. సెంథిల్‌కుమార్ను ముఖ్యమంత్రికి అదనపు ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి-I గా బదిలీ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంంటే.. ఐఏఎస్ సెంథిల్ కుమార్ను తన కార్యదర్శిగా నియమించుకుని ఆయనకు విజయ్ కీలక బాధ్యతలు అప్పగించారు.

ప్రభుత్వ ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న ఐఏఎస్ జి. లక్ష్మీ ప్రియ కూడా బదిలీ కావడం గమనార్హం. ఆమెను ముఖ్యమంత్రి కార్యదర్శి-II గా నియమించారు. విజయ్ స్పీడ్ చూస్తుంటే.. ఒకేఒక్కడులో అర్జున్ తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి అదనపు ప్రధాన కార్యదర్శి/కార్యదర్శి-I పదవి, ముఖ్యమంత్రికి కార్యదర్శి-II పదవి, ఐఏఎస్ (పే) రూల్స్, 2016 షెడ్యూల్ II-Aలో పేర్కొనబడిన "ప్రధాన కార్యదర్శి", "సహకార సంఘాల రిజిస్ట్రార్" కేడర్ పోస్టులతో హోదా, బాధ్యతల పరంగా సమానమైనవని ప్రభుత్వం ప్రకటించింది.

సీఎం అయిన గంటల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను తన కార్యదర్శులుగా నియమించుకుంటూ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు అధికార యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ స్పీడ్ చూస్తుంటే.. తమిళనాడులో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మంత్రులకు శాఖల విషయంలో కూడా ఇప్పటికే సీఎం విజయ్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే.. ఇంత త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ విజయ్ తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారారు.