రాలేకపోతున్నా.. ఏమనుకోవద్దు

రాలేకపోతున్నా.. ఏమనుకోవద్దు

పెళ్లింటికి ప్రధాని మోడీ ఉత్తరం.. ఫ్యామిలీ ఖుష్​

ఆ ఇంట్లో బుధవారం (సెప్టెంబర్​ 11) పెళ్లి. అందరికీ పెండ్లి పత్రికలు పంచారు. అందరితోపాటే స్పెషల్​గా ప్రధాని నరేంద్ర మోడీకీ పంపారు. మరి, ప్రధాని అంతటి వ్యక్తికి టైం దొరుకుద్దా ఆ పెళ్లికి రావడానికి? అందుకే తనకు టైం కుదరట్లేదని, పెళ్లికి రాలేకపోతున్నానని, ఏమనుకోవద్దని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ ఇంటికి లెటర్​ రాశారు. ప్రధాని నుంచే లెటర్​ రావడంతో ఆ కుటుంబం తెగ ఖుషీ అయిపోతోంది. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన టీఎస్​ రాజశేఖరన్​, మెడికల్​ రీసెర్చర్​గా చేసి రిటైరయ్యారు. సెప్టెంబర్​ 11న కూతురు రాజశ్రీ పెళ్లి పెట్టుకున్నారు.

పెళ్లికి రావాల్సిందిగా ప్రధానికి ఆహ్వానం పంపారు. లెటర్​ ద్వారా ఆ కాబోయే దంపతులకు ఆశీస్సులు పంపారు. ‘‘మీ కూతురు పెళ్లికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. అందుకు మీకు కృతజ్ఞతలు. కొత్త దంపతుల భవిష్యత్తు ఆనందంతో, అన్యోన్య దాంపత్యంతో ఉండాలని కోరుకుంటున్నా. అయితే, నాకు టైం కుదరకపోవడం వల్ల పెళ్లికి రాలేకపోతున్నా” అని మోడీ ఆ లెటర్​లో పేర్కొన్నారు. ప్రధాని మోడీ నుంచి రిప్లై రావడంతో ఆ ఫ్యామిలీ మస్త్‌ ఖుష్‌ అయింది.