న్యూఢిల్లీ: ‘నా సమయం వచ్చేసింది.. ఇక దేశం కోసం ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలవడమే నా టార్గెట్. దీనికోసం ఎంతవరకైనా వెళ్తా.. ఎంతైనా కష్టపడతా’... విమెన్స్ బాక్సింగ్ (52 కేజీ)లో వరల్డ్ చాంపియన్గా నిలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ చెప్పిన మాటలు ఇవి. దాదాపు నాలుగేళ్ల తర్వాత వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణ చరిత్ర సృష్టించిన నిఖత్.. లెజెండరీ బాక్సర్లు మేరీకోమ్, సరితా దేవి సరసన నిలవడంతో పాటు చిన్నప్పుడు తను పడిన కష్టాలు, అనుభవించిన బాధలు, వాటిని అధిగమించడంలో ఫ్యామిలీ నుంచి అందిన సహకారం వంటి అంశాలు ఆమె మాట్లలోనే..
ఒలింపిక్ డ్రీమ్ గురించి..
నేషనల్స్కు ముందు ‘పారిస్’ సన్నాహాలు మొదలయ్యాయని నా ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టా. అప్పటి నుంచి నా మైండ్లో మెగా గేమ్సే మెదులుతున్నాయి. ఏ టోర్నీ అయినా గెలుపు, ఓటమి గురించి ఆలోచించడం లేదు. అనుభవం సాధించాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నా. ఈ అనుభవం నాకు ఒలింపిక్స్లో పనికొస్తుంది. నా దేశం తరఫున ఒలింపిక్స్లో మెడల్ గెలిచేందుకు శాయశక్తుల కృషి చేస్తా. నా బలహీనతలేంటో నాకు తెలుసు. వాటినే నా బలంగా మార్చుకున్నా.
ఫైనల్లో ఒత్తిడికి గురైనా..
ఫైనల్ మ్యాచ్ కావడంతో ఒత్తిడికి గురయ్యా. థాయ్లాండ్ ఓపెన్లో జుటామస్పై గెలవడం నాకు ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ను ఇచ్చింది. ఏదేమైనా మెడల్ కోసం బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వాలని ముందే రెడీ అయ్యా. మూడు రౌండ్లు, తొమ్మిది నిమిషాలు నావే అని బలంగా నమ్మా. తొలి రెండు రౌండ్లు గెలిచి.. లాస్ట్ రౌండ్లో డిఫెన్స్ చేద్దామనుకున్నా. కానీ సెకండ్ రౌండ్ జుటమాస్కు అనుకూలంగా మారింది. దీంతో ఆఖరి రౌండ్లో మరింత కష్టపడాల్సి వచ్చింది. 2016 చాంపియన్షిప్లో క్వార్టర్స్లోనే ఓడా. ఆరేళ్ల తర్వాత మళ్లీ నాకు అవకాశం వచ్చింది. అప్పుడే గోల్డ్ గెలుస్తానన్న ఆశ కలిగింది. చివర్లో రిఫరీ నన్ను విజేతగా ప్రకటించగానే చాలా సంతోషంతో పాటు భావోద్వేగానికి గురయ్యా.
ఇద్దరు లెజెండ్స్ సరసన చోటుపై
మేరీకోమ్, సరితా దేవి లెజెండరీ బాక్సర్లు. వారి సరసన చోటు దక్కడం చాలా హ్యాపీగా, గర్వంగానూ ఉంది. మేరీకి చాలా అనుభవం ఉంది. ఎన్నో రికార్డులు సృష్టించింది. కానీ ఇద్దరు బాక్సర్లు రింగ్లో వెళ్తే ఒక్కరే గెలుస్తారు. క్వాలిఫయింగ్లో ఆమె గెలిచి టోక్యో ఒలింపిక్స్కు వెళ్లింది. దురదృష్టంకొద్దీ పతకం మిస్ చేసుకుంది. కామన్వెల్త్ ట్రయల్స్లో మేరీ 48 కేజీల్లో బరిలోకి దిగుతుందని విన్నా. కాబట్టి మేమిద్దరం మళ్లీ పోటీ పడే చాన్స్ లేదనుకుంటున్నా.