
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నామినేషన్ల గడువు శనివారంతో ముగిసింది. గుర్తింపు సంఘం ఎన్నికల కోసం శుక్ర, శనివారాల్లో హైదరాబాద్లోని సెంట్రల్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫీసులో నామినేషన్లను తీసుకున్నారు. మొత్తం 14 కార్మిక సంఘాలు నామినేషన్లు వేశాయి. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం వరకు గడువు ఇచ్చారు. మంగళవారం వాటిని పరిశీలించిన అనంతరం గుర్తులు కేటాయిస్తారు.
ఈనెల 28న ఎన్నికలు జరుగుతాయి. గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలంటూ సింగరేణి యాజమాన్యం హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. దీనిపై ఈనెల 11న తీర్పు రానుంది. డివిజన్ బెంచ్ తీర్పు తర్వాతే ఎన్నికల వాతావరణం హీటెక్కనుంది. ఎన్నికలు వాయిదా పడ్తాయని ధీమాతో ఉన్న యాజమాన్యం.. ఇంకా కార్మిక సంఘాలకు ఓటర్ల లిస్టులను అందజేయలేదు. సింగరేణి కోల్ మైన్స్కార్మిక సంఘ్(బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య శనివారం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా మిగిలిన సంఘాలు ఈనెల 11న కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ప్రచారాన్ని ప్రారంభించే అవకాశంఉంది.
ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, టీబీజీకేఎస్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, తెలంగాణ రీజనల్ సింగరేణి కార్మిక సంఘం, శ్రామిక శక్తి గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం, గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం (ఇఫ్టూ), సింగరేణి కార్మిక సంఘం, ప్రజా తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో ఉన్నాయి.