విద్యార్థిపై ఉడ్ డస్టర్ విసిరిన టీచర్.. తీవ్రగాయం.. 3 కుట్లు

విద్యార్థిపై ఉడ్ డస్టర్ విసిరిన టీచర్.. తీవ్రగాయం.. 3 కుట్లు
  • ల్యాబ్​లో జారిపడ్డానని చెప్పాలని బెదిరింపు 
  • స్కూల్​కు వెళ్లి ఫర్నిచర్​ధ్వంసం చేసిన పేరెంట్స్​
  • కరీంనగర్​లోని శ్రీచైతన్య స్కూల్​లో ఘటన 

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ వావిలాలపల్లి శ్రీ చైతన్య స్కూల్ లో 5వ తరగతి చదువుతున్న స్టూడెంట్ నోట్ బుక్ తెచ్చుకోలేదని తల పగలగొట్టిందో టీచర్. ఉడ్​ డస్టర్ ను విసిరేయడంతో బాలుడి తలకు గాయమైంది. కరీంనగర్ ​జిల్లా కేంద్రంలోని సుభాష్​నగర్​కు చెందిన చందన్, కిరణ్మయి దంపతుల కొడుకు జయంత్.. వావిలాలపల్లి శ్రీచైతన్య స్కూల్​లో ఐదో తరగతి చదువుతున్నాడు.

ఎప్పటిలాగే శుక్రవారం స్కూల్​కు వెళ్లిన జయంత్​ను ఫస్ట్​ పీరియడ్​లో ఇంగ్లీష్ ​టీచర్ ​మహేశ్వరి.. నోట్​బుక్​ ఏదని అడిగింది. మర్చిపోయి వచ్చానని చెప్పడంతో ఆమె​ కోపంతో ఊగిపోయింది. చేతిలో ఉన్న ఉడ్​డస్టర్​ను విసిరేయడంతో బాలుడి తల పగిలి రక్తం వచ్చింది. దీంతో అక్కడే ఫస్ట్​ఎయిడ్​ చేశారు. ఇంటికి వెళ్లాక అడిగితే ల్యాబ్​లో జారి పడ్డానని చెప్పాలని బెదిరించారు. మళ్లీ వారే 11 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్​చేసి మీ అబ్బాయికి దెబ్బ తాకిందని చెప్పారు.

దీంతో వారు స్కూల్​కు వెళ్లి మేనేజ్​మెంట్​ను ఏమైందని ప్రశ్నించగా సరైన సమాధానమివ్వలేదు. జయంత్​ను అడగ్గా అసలు విషయం చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు అక్కడి ఫర్నిచర్​ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో స్కూల్​ సిబ్బంది నెట్టివేయగా బాలుడి  తల్లి కిరణ్మయి కిందపడి స్పృహ తప్పింది. తర్వాత పిల్లవాడిని హాస్పిటల్​కు తీసుకువెళ్లగా మూడు కుట్లు వేశారు.

విషయం తెలుసుకున్న ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులపై దాడులు ఆపాలని, జయంత్​ను గాయపరిచిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎదుట ధర్నా చేశారు. త్రీ టౌన్​ సీఐ దామోదర్​రెడ్డి హాస్పిటల్​కు వెళ్లి జయంత్​తో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.