
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టెస్టుకు సిద్ధమైంది. ఇండోర్ వేదికగా బుధవారం నుంచి మూడో టెస్టు మొదలు కాబోతుంది. ఇప్పటికే ఈ సిరీస్లో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు..ఈ మ్యాచులోనూ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని చూస్తోంది. అయితే ఈ టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆసీస్ పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
పెరగనున్న ఆసీస్ బలం..
తొలి రెండు టెస్టులకు దూరమైన మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో చేరడంతో ఆసీస్ బలం పెరిగింది. ఈ నేపథ్యంలో తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఎలాగైనా మూడో మ్యాచులో గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.
కోహ్లీకి మెరుగైన రికార్డు..
ఇండోర్లో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. అతని ఇండోర్ పిచ్పై 228 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ కంటే రహానే అత్యధిక పరుగులు సాధించాడు. అతను రెండు మ్యాచుల్లో 148.50 ఆవరేజ్తో 297 పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత 243 పరుగులతో మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. బౌలర్లలో అశ్విన్, షమీకి ఈ పిచ్పై మంచి రికార్డు ఉంది. ఇండోర్లో రెండు మ్యాచ్లు ఆడిన అశ్విన్..18 వికెట్లు పడగొట్టాడు. షమీ 11 వికెట్లు సాధించాడు. వీరిద్దరు మరోసారి చెలరేగితే ఆసీస్ కు కష్టాలు తప్పవు.
పిచ్ ఎలా ఉంటుందంటే..?
నాగ్పూర్, ఢిల్లీ స్టేడియాల్లోని పిచ్లు స్పిన్కు సహకరించగా..ఇండోర్ పిచ్ బ్యాట్స్మన్ కు సహకరించబోతున్నట్లు తెలుస్తోంది. పిచ్ మధ్యలో గడ్డి కారణంగా బ్యాట్స్మన్కు సహకరించే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫాస్ట్ బౌలర్లకు పిచ్ సహకరిస్తందట. పిచ్పై పగుళ్లు లేకపోవడంతో స్పిన్నర్ల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అటు ఈ పిచ్పై భారీ స్కోరు నమోదయ్యే ఛాన్సుంది.
ఒక టెస్టు..మూడు టార్గెట్లు
మరోవైపు మూడో టెస్టులో భారత్ గెలిస్తే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023ని మరోసారి సొంతం చేసుకుంటుంది. దీంతో ఈ సిరీస్లో మరోసారి టీమిండియాదే ఆధిపత్యం కానుంది. దీనికి తోడు మూడో టెస్టులో గెలుపుతో భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. అలాగే టెస్టు్ల్లో నెంబర్ వన్ ర్యాంకు భారత్ వశమవుతుంది. అయితే నెంబర్ వన్ ర్యాంక్ ను కాపాడుకోవాలంటే మాత్రం నాలుగో టెస్టులో భారత్ ఓడిపోకూడదు.