
374 పరుగలు టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 8 వికెట్ల నష్టానికి 306 పరుగలు మాత్రమే చేసింది. శ్రీలంక కెప్టెన్ శనక(108) సెంచరీ చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో భారత్ 67 పరుగులతో విజయం సాధించింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (5) పరుగులకే ఔట్ కావడంతో లంక జట్టుకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత వచ్చిన కుశాల్ మెండిస్ (0) డకౌట్గా వెనుదిరిగాడు. అలా క్రీజులో కుదురుకున్నట్టుగా కనిపించిన మరో ఓపెనర్ చరిత్ అసలంక (23) కూడా వెనుదిరగడంతో శ్రీలంక జట్టు 64 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ధనంజయ (47), నిశాంక (72) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు, మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోరును పెంచారు. అయితే వీరి జోడీని షమీ వీడదీశాడు.
షమీ వేసిన 24వ ఓవర్లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ధనంజయ ఔట్ కాగా, కాసేపటికే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో నిశాంక కూడా వెనుదిరిగాడు. దీంతో సగం స్కోర్ చేయకముందే లంక జట్టు సగం వికెట్లను కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన హసరంగ చాహల్ చాహల్ వేసిన 32 ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు, ఓ ఫోర్ బాది జోరు మీద కనిపించాడు. కానీ ఆ తరువాత బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి శ్రేయస్ అయ్యర్కు చిక్కాడు. అనంతరం ఉమ్రాన్ మాలిక్ వేసిన 33వ ఓవర్లో రెండో బంతికి వెల్లలాగే (0) గోల్డెన్ డక్గా ఔటయ్యాడు. దీంతో 200 స్కోర్ చేయకముందే లంక టాప్ ఆర్డర్ అంత కూప్పకూలిపోయింది.
ఇక శ్రీలంక పని అయిపోయిందనుకున్న టైమ్ లో శ్రీలంక కెప్టెన్ శనక దూకుడుగా ఆడాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నప్పటికీ టీమిండియా బౌలర్లను అతను ధీటుగా ఎదురుకున్నాడు. ఐదో బ్యాట్స్ మెన్ గా క్రీజ్ లోకి వచ్చిన అతను సెంచరీ బాదాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. కానీ అతని పోరాటం వృధా అయిపోయింది. మూడు వన్డేల సీరిస్ లో భాగంగా టీమిండియా1–0తో ముందంజలో ఉంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే గురువారం జరగనుంది.