రెండో వన్డేలోనూ కివీస్ ఓటమి..సిరీస్ ఇండియాదే

రెండో వన్డేలోనూ కివీస్ ఓటమి..సిరీస్ ఇండియాదే

రాయ్ పూర్ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 109 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన కేవలం  20.1 ఓవర్లలో 2 వికెట్ మాత్రమే నష్టపోయి అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ  హాఫ్ సెంచరీతో రాణించగా..మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 40 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0తో దక్కించుకుంది. సిరీస్ లో భాగంగా చివరి వన్డే ఈ నెల 27న జరగనుంది. 

రోహిత్ హాఫ్ సెంచరీ..


109 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదర్కొన్నారు. చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ  స్కోరు బోర్డును నడిపించారు. ఇదే క్రమంలో  కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు.  48 బంతుల్లో  7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో వన్డేల్లో 48వ అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అటు శుభ్ మన్ గిల్ 40 పరుగులు చేశాడు.  ఇదే క్రమంలో  తొలి వికెట్ కు  తొలి వికెట్ కు 72 పరుగులు జోడించారు. అయితే 51 పరుగులు చేసిన రోహిత్ శర్మ షిప్లే బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ వరుస ఫోర్లతో జోరుమీదున్నట్లు కనిపించినా..ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 11 పరుగులు చేసిన కోహ్లీ స్టంప్ ఔట్ అయ్యాడు. దీంతో  భారత్ 98 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తో సహకారంతో  శుభ్ మన్ గిల్ టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో  షిప్లే, సాంట్నర్ చెరో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌట్ అయింది.  మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే నిప్పులు చెరిగిన భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లను వణికించారు. కివీస్ పరుగుల ఖాతా తెరవకుండానే మహ్మద్ షమీ బౌలింగ్ లో  తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే ఫిన్ అలెన్ (0) డకౌట్ చేశాడు. ఆ తర్వాత 8 పరుగుల వద్ద న్యూజిలాండ్ మరో వికెట్ ను కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో నికోల్స్ పెవీలియన్ చేరాడు.  20 బంతులు  ఆడిన నికోల్స్ 2 పరుగులే చేసి  గిల్ కు  క్యాచ్  ఇచ్చి ఔటయ్యాడు. ఈ సమయంలో మళ్లీ బౌలింగ్ కు వచ్చిన  షమీ డారెల్ మిచెల్ (1)  బుట్టలో వేసుకున్నాడు. స్ట్రైట్ షాట్ ఆడేందుకు   ప్రయత్నించిన మిచెల్.. షమీకే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత తన తొలి ఓవర్ లోనే హార్దిక్ పాండ్యా  డెవాన్ కాన్వేను పెవీలియన్ చేర్చాడు. కాన్వే కొట్టిన స్ట్రైట్ డెలివరీని పాండ్యా అద్బుతంగా ఎడమ చేత్తో పట్టేశాడు. అనంతరం కెప్టెన్ టీమ్ లాథమ్ శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో..న్యూజిలాండ్ 15 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 

ఆదుకున్న  బ్రేస్ వెల్, ఫిలిప్స్..

ఈ సమయంలో న్యూజిలాండ్ ను బ్రేస్ వెల్, గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. భారత బౌలర్లను జాగ్రత్తగా ఎదర్కొంటూ స్కోరు బోర్డును నడిపించారు. చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ..స్కోరును మందుకు నడిపించారు. ఇదే క్రమంలో ఆరో వికెట్ కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ సమయంలో షమీ మరోసారి  కివీస్ కష్టాలను రెట్టింపు చేస్తూ.. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్ వెల్ (22)ను 6వ వికెట్ గా ఔట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 56 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.  ఆతర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ సాంట్నర్..ఫిలిప్స్ కు సహకారం అందించాడు. వీరిద్దరు7వ వికెట్ కు   47  పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో న్యూజిలాండ్ వంద పరుగుల మార్కును చేరుకుంది. 

వరుసగా నాలుగు వికెట్లు..

ఆ తర్వాత న్యూజిలాండ్ 103 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు నష్టపోయింది. 27 పరుగులు చేసిన సాంట్నర్ ను హార్దిక్ పాండ్యా పెవీలియన్ చేర్చగా..36 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న ఫిలిప్స్ ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. అనంతరం 105 పరుగుల వద్ద  ఫెర్గ్యూసన్..108 పరుగుల వద్ద టిక్నర్ ఔట్ అయ్యారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు, పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. సిరాజ్, ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.