
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ మ్యాచ్ కు హాజరయ్యాడు. రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన పంత్.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే దాదాపు మూడు నెలల తర్వాత తొలిసారిగా అభిమానుల ముందుకు వచ్చాడు. అభిమానుల కోరిక మేరకు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్, ఢిల్లీ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చిన రిషబ్ పంత్ కు అభిమానులు, డీడీసీఏ అధికారులు స్వాగతం పలికారు. పంత్ వస్తున్నాడని ముందే తెలియడంతో అతని కోసం డీడీసీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. పంత్ ను స్టాండ్స్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. పంత్ ను చూడగానే స్టేడియం అంతా ఒక్కసారిగా పంత్ పంత్ అంటూ మార్మోగిపోయింది. ఈ సమయంలో ఫ్యాన్స్ కు పంత్ అభివాదం చేశాడు. బిగ్ స్క్రీన్ పై పంత్ కనిపించినప్పుడల్లా ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.
2022 డిసెంబర్ 30న కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతనికి రెండు సర్జరీలు జరిగాయి. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. అయితే అప్పుడప్పుడూ సోషల్ మీడియా ద్వారా హెల్త్ అప్డేట్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఊతకర్ర సాయంతో నడుస్తున్నాడు.