న్యూఢిల్లీ: ప్రత్యర్థి ఎవరైనా సరే.. సొంతగడ్డ పై ఆడుతుందంటే ఆ సిరీస్లో టీమిండియానే ఫేవరెట్ అని ఆస్ట్రేలియా లెజెండ్ స్టీవ్ వా అన్నాడు. ‘బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత గతేడాది ఇండియా టూర్తో ఆసీస్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. పరిస్థితులతో సంబంధం లేకుండా ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించగలమనే నమ్మకం జట్టులో ఏర్పడింది. అయితే గతం ఎలా ఉన్నా ఇండియాలో ఇండియానే ఎప్పుడూ ఫేవరెట్’ అని అన్నాడు. ఈ ఏడాది చివరిలో టీమిండియా ఆసీస్ టూర్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పాడు. ‘ఇండియా, ఆస్ట్రేలియా ఎప్పుడు తలపడినా మజా ఉంటుంది. ఇప్పుడే ఆ టూర్పై అందరిలోనూ ఆసక్తి నెలకొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్మిత్, వార్నర్ రీఎంట్రీ తర్వాత మా బలం పెరిగింది. లబుషేన్ జట్టుకు అదనపు బలం. కానీ ప్రస్తుతం టీమిండియానే వరల్డ్లో బెస్ట్ టీమ్. అందువల్ల ఈ సిరీస్ చరిత్రలో నిలిచిపోనుంది. ఆసీస్లో డే నైట్ టెస్ట్ ఏ జట్టుకైనా సవాలే. ఆ చాలెంజ్కు కోహ్లీ సై అంటాడని భావిస్తున్నా. ఎందుకంటే వరల్డ్ బెస్ట్ టీమ్ అంటే అన్ని పరిస్థితుల్లోనూ ప్రత్యర్థులను ఓడించాలి. టీమిండియా ఆ పని తప్పకుండా చేస్తుందనుకుంటా’ అని అన్నాడు. అంతేకాక ఫోర్ డే టెస్ట్లను వ్యతిరేకిస్తున్నానని స్టీవ్ వా స్పష్టం చేశారు.


