
ఆన్లైన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో సైబర్ నేరగాళ్లు హైదరాబాద్లో ఓవ్యక్తి నుంచి రూ. 1.21 కోట్లు దోచుకున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా బాధితులను ఆకర్షించి, ఫేక్ వెబ్సైట్ లింకులతో ట్రేడింగ్ చేయించారు. భారీ లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు కొట్టేశారు. బాధితులు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సైబరాబాద్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం ప్రకారం.. కేటుగాళ్లు హైదరాబాద్ కు చెందిన ఓ టెకీకి స్టాక్ మార్కెట్లో పెట్టబడి పేరుతో ఆన్ లైన్ లో పరిచయం అయ్యారు. అధిక డబ్బులు ఆశ చూపి బాధితుడిని నమ్మించారు. రూ. 32 కోట్ల లాభం వస్తుందని నమ్మించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొదట్లో రూ. 50 వేలు పెట్టుబడి పెట్టాడు. బాధితుడిని వాట్సాప్ గ్రూప్లో చేర్చి కొన్ని రోజుల పాటు నమ్మించి ఇలా రూ. 1.21 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేలా చేశారు మోసగాళ్లు. తర్వాత బాధితుడు డబ్బును విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా అతనికి యాక్సెస్ డియాక్టివ్ చేశారు. మనీ విత్ డ్రా చేయాలంటే ఎక్స్ ట్రా పేమెంట్ చేయాలని బాధితుడికి సాకులు చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
90 శాతం మంది విద్యావంతులే..
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ఫోన్స్ ఉంటున్నాయి. అన్ లిమిటెడ్ మొబైల్ డేటా, లక్షల సంఖ్యలో యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బెస్ట్ కనెక్టివిటీకి నిలయంగా మారాయి. అలాగే కరెన్సీ నోట్లకు బదులు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. వీటన్నింటినీ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సోషల్ మీడియాలో బాధితులను ట్రాప్ చేసి, ఆ తర్వాత లింక్స్ పంపించి.. వాళ్ల బ్యాంక్ అకౌంట్లను కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ వేదికగా దాదాపు 185 రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కామన్మెన్ నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ప్రతిఏటా నమోదవుతున్న సైబర్ నేరాల బాధితుల్లో 90 శాతం మంది విద్యావంతులే ఉంటున్నారు.