కీసర, వెలుగు: తెలంగాణలో ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసేలా సర్కార్ విద్యా విధానం ఉందని క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కీసర మండల పరిధిలోని కీసర, యాద్గిర్పల్లి, చిర్యాల్, భోగారం, నాగారం, దమ్మాయిగూడ ప్రభుత్వ స్కూళ్లను మంగళవారం తీన్మార్ మల్లన్న సందర్శించారు. స్కూల్లో విద్య, మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాల గురించి స్టూడెంట్లు, టీచర్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం తీన్మార్ మల్లన్న సొసైటీ నుంచి 9,10వ తరగతికి చెందిన సుమారు 1,200 మంది స్టూడెంట్లకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి తమ సొసైటీ నుంచి నోటు పుస్తకాల పంపిణీ, టెన్త్ లో మండలంలో ఉన్నత గ్రేడ్ సాధించే విద్యార్థికి రూ. 50 వేల ఆర్థిక సాయం చేస్తానని మల్లన్న హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీమ్ సభ్యులు వెంకట్ రెడ్డి, కర్రె గణేష్, సుంకరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.