దేశ ఏరో ఇంజిన్ క్యాపిటల్గా తెలంగాణ : మంత్రి శ్రీధర్ బాబు

దేశ ఏరో ఇంజిన్ క్యాపిటల్గా తెలంగాణ :  మంత్రి శ్రీధర్ బాబు
  • ‌‌‌‌2030 నాటికి తీర్చిదిద్దేలా రోడ్​ మ్యాప్: మంత్రి శ్రీధర్​బాబు
  • ‌‌‌‌ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్​కు హాజరు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను 2030 నాటికి దేశ ఏరో ఇంజిన్ రాజధానిగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అందుకోసం ప్రపంచంతో పోటీపడేలా దిగ్గజ పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏరోస్పేస్​, డిఫెన్స్ ఎకోసిస్టమ్​ను అభివృద్ధి చేసేందుకు సమగ్రమైన రోడ్​మ్యాప్​ రూపొందిస్తున్నామని చెప్పారు. 

‘ఎండ్ టూ ఎండ్ ఎకో సిస్టం’ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన పునాదులే ప్రస్తుతం తెలంగాణను దేశ వ్యూహాత్మక రక్షణ వేదికగా మార్చాయని పేర్కొన్నారు. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్, ఐఎస్ బీ, ముంజాల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సంయుక్తంగా.. శనివారం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)లో నిర్వహించిన ‘ఎంపవరింగ్ ఆత్మనిర్భర్ భారత్: ఇండియాస్ ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో నమోదవుతున్న వేగవంతమైన వృద్ధిని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. 

ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలతో గ్లోబల్ సప్లై చైన్ ఒత్తిడికి గురవుతున్నది. ఇలాంటి టైమ్​లో సరఫరాదారుల కోసం ప్రపంచం ముఖ్యంగా ‘ఇండియా’ లాంటి దేశాలవైపు చూస్తున్నది. నిరుడు దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటింది’’ అని శ్రీధర్ బాబు అన్నారు. 

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల  ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్య సాధనలో ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్’ రంగం కీలక పాత్ర పోషించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని శ్రీధర్ బాబు అన్నారు. ‘‘ఇప్పటికే రాష్ట్రంలో 25కు పైగా ‘ఏ అండ్ డీ’ అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు, సుమారు 1500కు పైగా ఎంఎస్ఎంఈలు ‘తెలంగాణ బ్రాండ్’ ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. 

రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతుల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,900 కోట్లు కాగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేవలం మొదటి 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరగడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు సాక్ష్యం. ఆదిభట్లలో రూ.425 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ‘టాటా–సాఫ్రాన్’ ఫెసిలిటీ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే రూ.800 కోట్లతో జేఎస్ డబ్ల్యూ డిఫెన్స్ ‘యూఏవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్’, రూ.500 కోట్లతో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ కూడా వస్తాయి’’అని శ్రీధర్ బాబు అన్నారు. 

ఈ తరహాలోనే పెట్టుబడులు పెట్టేందుకు మరికొన్ని దిగ్గజ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో హీరో ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ కాంత్ ముంజాల్, ఐఎస్ బీ డీన్ ప్రొఫెసర్ పి.మదన్, ప్రొఫెసర్ చందన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.