
- ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- రాజ్భవన్లో వేడుకగా ప్రమాణ స్వీకారం
- హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- 19 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ.. 15కు చేరిన మంత్రుల సంఖ్య.. కేబినెట్లో మరో 3 ఖాళీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్లో కొత్తగా ముగ్గురు మంత్రులు చేరారు. ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమక్షంలో చెన్నూరుఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. ముందుగా వివేక్ ఇంగ్లిష్లో, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. కొత్త మంత్రులకు గవర్నర్ బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర కొద్దిమంది అతిథుల సమక్షంలో మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 12:22 గంటల వరకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
అనంతరం రాజ్భవన్లోని లాన్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులందరితో కలిసి గవర్నర్ గ్రూప్ ఫొటో దిగారు. కొత్త మంత్రులు వివేక్, శ్రీహరి, లక్ష్మణ్కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ స్టేట్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, పాయల్ శంకర్, హరీశ్బాబు తదితరులు పాల్గొన్నారు. కొత్త మంత్రుల వెంట కుటుంబసభ్యులు సహా వాళ్ల నియోజకవర్గాల నుంచి కీలక నేతలు హాజరయ్యారు.
మొత్తం 18 బెర్తుల్లో..
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 19 నెలల తర్వాత కేబినెట్ను విస్తరించారు. 2023 డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్లో సీఎం సహా 18 మందికి అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా ముగ్గురు కేబినెట్లో చేరడంతో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.