V6 News

86 శాతం ‘రేషన్’ పంపిణీ పూర్తి

86 శాతం ‘రేషన్’ పంపిణీ పూర్తి

హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అమలులో తెలంగాణ మరోసారి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర సివిల్ సప్లై శాఖ 3 నెలల రేషన్​బియ్యం పంపిణీలో 86 శాతాన్ని గడువు(ఈ నెల 30)కు ముందే పూర్తి చేసింది. ఈ నెల 21 నాటికే 5,48,140 టన్నుల బియ్యాన్ని రేషన్​కార్డు ఉన్నవారికి అందించింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్​ నెలలకు సంబంధించి బియ్యం పంపిణీని ముందుగానే పూర్తి చేయాలని గత మార్చి 2న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 6,43,303 టన్నుల బియ్యం కేటాయించింది. 

రాబోయే సీజన్‌ లో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తే గోదాముల్లో స్థలం ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సివిల్​సప్లై అధికారులు రేషన్​షాపుల ద్వారా లబ్ధిదారులకు బియ్యం త్వరగా అందించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2.62 కోట్ల ట్రాన్సాక్షన్స్ విజయవంతంగా నమోదయ్యాయి. బియ్యం పంపిణీలో పారదర్శకతను ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.