
ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచరంతో సమాధానాలు పంపాలని అధికారులకు తెలిపారు. బడ్జెట్ సెషన్లో గ్యాప్ లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు తెలిపారు. నోట్ ఆన్ డిమాండ్ రూపొందించి బడ్జెట్ను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శులు సందీప్కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, శైలజా రామయ్యర్, కార్యదర్శులు రఘునందన్రావు, బుద్ధ ప్రకాష్ జ్యోతి, వి కరుణ, లోకేష్ కుమార్, సిఐపిఆర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 23న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. సభ ప్రారంభమైన వెంటనే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ సీపీ రాధాకృష్ణణ్ ప్రసంగిస్తారు. మరోవైపు మండలి సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి.