జీసీ లింక్లో సగం వాటా ఇవ్వాల్సిందే..పోలవరం నుంచి చేపడతామంటే కుదరదు.. ఎన్డబ్ల్యూడీఏకి తెలంగాణ లేఖ

జీసీ లింక్లో సగం వాటా ఇవ్వాల్సిందే..పోలవరం నుంచి చేపడతామంటే కుదరదు.. ఎన్డబ్ల్యూడీఏకి తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు: గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించే 148 టీఎంసీల్లో తమకు 74 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మిస్తే.. అక్కడి నుంచి మరో 200 టీఎంసీలు తరలించుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్​ చేసింది. ఇటీవల నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) గవర్నింగ్​ బాడీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో తెలంగాణ వాదనలను ఎన్​డబ్ల్యూడీఏ వినలేదు.

ఈ క్రమంలోనే మూడ్రోజుల క్రితం ఎన్​డబ్ల్యూడీఏకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. నిరుడు ఆగస్టులో నిర్వహించిన ఆరో కన్సల్టేషన్ మీటింగ్​లో చెప్పిన అంశాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. జీసీ లింక్​ను తెలంగాణ భూ భాగం నుంచి చేపడుతున్నప్పుడు.. తమ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. 45 టీఎంసీలే ఇస్తామంటే కుదరదని పేర్కొంది. అంతేగాకుండా ఏపీ చేపడుతున్న నాలుగు ఇంట్రా లింక్​ ప్రాజెక్టులైన చింతలపూడి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​, బాబు జగ్జీవన్​ రామ్​ సుజల స్రవంతి, వైఎస్​ఆర్​ పల్నాడు డ్రాట్​ మిటిగేషన్​ స్కీమ్​, గుండ్రేవుల రిజర్వాయర్​లకు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్​ చేసింది.

పోలవరం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని, ఏపీ కోరుతున్నట్టుగా పోలవరం నుంచి గోదావరి కావేరి లింక్​ను చేపట్టొద్దని డిమాండ్​ చేసింది. గోదావరి నదిలో తమకున్న 968 టీఎంసీల జలాలపై హక్కులకు రక్షణ కల్పించాలని కోరింది. ఇచ్చంపల్లి నుంచి తరలించే నీళ్లను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయొద్దని, తమకు కావాల్సిన చోట వాడుకుంటామని తేల్చి చెప్పింది. జీసీ లింక్​లో భాగంగా కృష్ణా బేసిన్​లో రెండు రిజర్వాయర్లను కట్టించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.