- వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: వాటర్ బోర్డు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు ఎట్టకేలకు సర్కార్ ఆమోదం తెలిపింది. జీవో నం.51 ద్వారా గత జులై నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న పీఆర్సీనే వాటర్బోర్డు ఎంప్లాయీస్కు కూడా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుందని వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ప్రతి నెల వాటర్ బోర్డు జీత భత్యాలకు రూ.12 కోట్లు అదనంగా చెల్లించనుంది. ఉద్యోగులు తీసుకునే జీతం రూ.7 వేల నుంచి రూ.25 వేల పెరగనుంది. వాటర్ బోర్డులోని 3,900 మంది ఉద్యోగులకు, 3,200 మంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, 500 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా వర్తించనుంది.
కొంతకాలంగా వాటర్బోర్డు ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్స్ఇయ్యాలని పోరాడుతుండగా, వీరికి అధికార, ప్రతిపక్షాల నేతలు, అనుబంధ సంఘాలు నేతలు మద్దతు తెలిపారు. చివరకు పీఆర్సీ అమలు చేయకపోతే రిలే నిరాహార దీక్షలకు దిగుతామని తెలంగాణ వాటర్బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునివ్వగా, ప్రభుత్వ నిర్ణయంతో విరమించుకున్నట్లు యూనియన్ జనరల్ సెక్రటరీ రాఘవేంద్ర తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేశారు.