హైదరాబాద్, వెలుగు: అకడమిక్ ఇయర్ మొదలై మూడు నెలలు దాటినా ఇప్పటికీ పదో తరగతి పరీక్షలపై క్లారిటీ రాలేదు. రెండేండ్లుగా బోర్డ్ ఎగ్జామ్స్ లేకపోవడంతో ఈ ఏడాది పరీక్షలను ఎట్ల పెడ్తరోనని స్టూడెంట్లలో అయోమయం ఉంది. పాతపద్ధతిలాగానే 11 పేపర్లుంటయా? లేదంటే నిరుడు నిర్ణయించినట్టు 6 పేపర్లే ఉంటయా? సిలబస్ ఎంత? అన్న దానిపై విద్యాశాఖలో ఇంత వరకు కనీసం చర్చ కూడా జరగలేదు. సర్కార్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడం వల్లే ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అధికారులు చెప్తున్నారు. క్వశ్చన్ పేపర్లు, ఎగ్జామ్స్ విధానంపై టీచర్లకూ ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో.. స్టూడెంట్లు అడిగినా టీచర్లు ఏం చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,675 హైస్కూళ్లలో ఐదున్నర లక్షల మంది టెన్త్ చదువుతున్నారు. జులై ఫస్ట్ నుంచి ఆన్లైన్ క్లాసులు మొదలవగా.. సెప్టెంబర్ ఒకటి నుంచి ఫిజికల్ క్లాసులు జరుగుతున్నాయి.
ఎట్లుంటదో!
కరోనా వల్ల 2020, 2021లో టెన్త్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే ఫైనల్ మార్కులిచ్చి అందరినీ పాస్ చేసింది. 2020లో 11 పేపర్లతో ఎగ్జామ్స్ పెట్టేందుకు సర్కార్ రెడీ అయింది. మూడు పరీక్షలు పెట్టాక.. కరోనా కేసులు పెరుగుతుండటంతో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎగ్జామ్స్ను రద్దు చేసింది. 2021లో 11 పేపర్లను ఆరుకు కుదించింది. అయితే, కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆ పరీక్షలను రద్దు చేసింది. అయితే, ఈ ఏడాది మాత్రం ఎగ్జామ్ పెట్టే పేపర్లు, క్వశ్చన్పేపర్ ప్యాటర్న్ను ఇంతవరకు తేల్చలేదు. ఏటా అక్టోబర్ లేదా నవంబర్లో టెన్త్ ఎగ్జామ్ ఫీజులను వసూలు చేస్తుంటారు. ఆలోగానే ఎస్ఈఆర్టీ, పరీక్షల విభాగం అధికారులు పరీక్ష విధానంపై క్లారిటీ ఇస్తుంటారు. ఈ ఏడాది మాత్రం ఎలాంటి స్పష్టత లేకపోవడం, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై టీచర్ల సంఘాల నేతలు మండిపడుతున్నారు.
సిలబస్ ఎంత?
నిరుడు వంద శాతం సిలబస్ చెప్పాలని సర్కార్ ఆదేశించినా.. ఎగ్జామ్స్లో మాత్రం 70 శాతమే లెక్కలోకి తీసుకుంటామని బోర్డు ప్రకటించింది. ఈ అకడమిక్ ఇయర్లో జనవరి పది లోపే వంద శాతం సిలబస్ను పూర్తి చేయాలని అకడమిక్ క్యాలెండర్లో పేర్కొన్నారు. అయితే, అది సాధ్యమయ్యేది కాదని, సిలబస్ను తగ్గించాలని టీచర్ల సంఘాలు కోరుతున్నా.. సర్కార్ ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇటు టీచర్లతోపాటు స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. సర్కార్ ఆదేశాల మేరకే తాము ముందుకెళ్తామని ఓ ఉన్నతాధికారి చెప్పారు.