- ఎంపీడీఓలు, డీపీఓలకు జిల్లాల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఇటీవల అడ్హక్ పదోన్నతులు పొందిన 50 మంది అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిశోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే వీరికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ), జిల్లా పంచాయతీ అధికారుల (డీపీఓ) నుంచి డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డిప్యూటీ సీఈఓ) కేడర్కు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం.. తాజాగా వారిని వివిధ జిల్లాల్లో పోస్టింగ్లు ఇచ్చింది.
పదోన్నతి పొందిన అధికారులను కేవలం జిల్లా పరిషత్లకే పరిమితం చేయకుండా.. డీఆర్డీఏ, మెప్మా, సెర్ప్, పురపాలక శాఖ వంటి కీలక విభాగాలకు బదిలీ చేశారు. డి.శ్రీనివాసరావును సీఆర్డీ కార్యాలయంలో ఏఓగా, ఆర్.నటరాజ్ను టీజీటీడబ్ల్యూఆర్ఈఐ సొసైటీకి ఓఎస్డీగా నియమించారు. కె.నాగవర్ధన్ (నిర్మల్), ఎస్.వామన్రావు (మహబూబ్నగర్), జి.హరీశ్ కుమార్ (నల్గొండ) సహా పలువురిని అదనపు డీఆర్డీఓలుగా నియమించారు. ఇ.అనురాధ (మహబూబాబాద్), పి.శ్రీనివాసరావు (ఖమ్మం), ఎ.సంజీవరావు (పెద్దపల్లి), బి.సంధ్య (సిద్ధిపేట) ను జడ్పీ డిప్యూటీ సీఈఓలుగా నియమించారు.
సి.రాధను జీహెచ్ఎంసీ ఐటీ విభాగం జాయింట్ కమిషనర్గా, ఎ.శ్రీనివాసరెడ్డిని ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపల్ కమిషనర్గా పంపారు. మరోవైపు నారాయణపేట డీఆర్డీఓగా ఉన్న మొగులప్పను పదోన్నతిపై కుమురం భీమ్ ఆసిఫాబాద్ జెడ్పీ సీఈఓగా బదిలీ చేశారు. ములుగు జిల్లా అదనపు డీఆర్డీఓగా ఉన్న కృపాకర్కు పదోన్నతి కల్పిస్తూనే అదే స్థానంలో కొనసాగించారు. వి.జగదీశ్వర్ అనే అధికారి పదోన్నతిని నిరాకరించడంతో ఆయన్ను ప్రస్తుత స్థానంలోనే కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వికారాబాద్ డీపీఓ పి.జయసుధ ను సెర్ప్ కు కేటాయించారు. తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది.
