
- ముంపు నివారణ పనులు కొనసాగించొచ్చు
హైదరాబాద్, వెలుగు: వానాకాలంలో వరద ముంపుకు గురికాకుండా బతుకమ్మకుంట వద్ద అవసరమైన పనులను కొనసాగించవచ్చని హైడ్రాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్కడి స్థలానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల హక్కుల వివాదంపై సివిల్ కోర్టులో ఇంజంక్షన్ పిటిషన్పై తేలేదాకా యథాతథస్థితిని కొనసాగించాలన్న గత ఉత్తర్వులను సవరించింది. హైదరాబాద్ బాగ్అంబర్పేట సర్వే నం.563/1లోని 7 ఎకరాలకు సంబంధించిన స్థలంపై మే 5న ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సవరించాలని కోరుతూ హైడ్రా వేసిన వ్యాజ్యంపై జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టితో కూడిన వెకేషన్ బెంచ్ ఇటీవల విచారించింది.
హైడ్రా తరఫు అడ్వకేట్ కె.పవన్కుమార్ వాదిస్తూ.. బతుకమ్మకుంట పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపడుతున్నదన్నారు. ఆక్రమణదారులు చెరువులో అక్రమంగా డంపింగ్ చేస్తూ చెరువును కబ్జా చేస్తున్నారని తెలిపారు. ఎ.సుధాకర్రెడ్డి, మరో ఆరుగురు బాగ్అంబర్పేటలోని 7 ఎకరాల భూమిపై హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి పిటిషన్ కొట్టివేశారని వివరించారు. తిరిగి అప్పీలు దాఖలు చేయగా హక్కులకు సంబంధించిన వివాదాలను హైకోర్టు తేల్చదని, సివిల్ కోర్టులో తేల్చుకోవాలని, అవసరమైతే ఇంజంక్షన్ ఉత్తర్వులు తెచ్చుకోవాలని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిపై ప్రైవేటు వ్యక్తులు సివిల్ కోర్టులో సూట్ దాఖలు చేశారని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు.
దీనిపై విచారించిన సింగిల్ జడ్జి ఇంజంక్షన్ దరఖాస్తు తేలేదాకా యథాతథస్థితి కొనసాగించాలంటూ మే 7న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని ఆయన వివరించారు. వానాకాలం వస్తున్నదని, ఇప్పుడు పనులు పూర్తిచేయకపోతే పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, మధ్యంతర ఉత్తర్వులను సవరించని పక్షంలో పూడ్చుకోలేని నష్టం వాటిల్లుతుందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం స్టేటస్ కో కొనసాగించాలని, అయితే వానాకాలంలో కాలనీలు ముంపునకు గురవుతాయన్న హైడ్రా వాదనను పరిగణనలోకి తీసుకుని ముంపు నివారణ పనులు చేపట్టడానికి అనుమతిస్తూ గత ఉత్తర్వులను సవరిస్తున్నట్లు పేర్కొంది.