హైదరాబాద్, వెలుగు: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. జస్టిస్ కె. సుజన మంగళవారం విచారణ చేపట్టగా పిటిషనర్ తరపు న్యాయవాది ప్రద్యుమ్నకుమార్రెడ్డి వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని, మార్చి 15 నుంచి జైలులో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో 11 మంది నిందితులుండగా కేవలం ముగ్గురినే జైలులో పెట్టారని మిగిలిన వారిని నోటీసులతో సరిపెట్టారన్నారు.
కేవలం 307 సెక్షన్ తప్ప మిగిలినవన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులేనన్నారు. దురుద్దేశంతో నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని కోరారు. దీనికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు విభేదిస్తూ నిందితుడు ఫాం హౌస్లో పార్టీలు నిర్వహించడం, డ్రగ్స్ సరఫరా చేయడం ఇదే మొదటిసారికాదని, గతంలోనూ ఇలాంటి సంఘటనలున్నాయన్నారు. కేవలం డ్రగ్స్ను తీసుకోవడమే కాకుండా సరఫరా కూడా చేస్తారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును ఈనెల 28కి వాయిదా వేశారు.

