హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాలకు సంబంధించి జీహెచ్ఎంసీకి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై పూర్తి చర్యలేవని జీహెచ్ఎంసీని ఇటీవల హైకోర్టు ప్రశ్నించింది. అందిన ఫిర్యాదుల్లో అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడమే తప్ప ఉత్తర్వులు మాత్రం కొన్నింటిలోనే జారీ చేస్తోందని పేర్కొంది. అక్రమ నిర్మాణాలపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్న దాఖలాలు ఈ కోర్టు దృష్టికి రాలేదంది.
అనధికార నిర్మాణాలపై ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల గురించి పౌరుల అవగాహనకు సొంత వెబ్సైట్లో వివరాలు పెట్టాలంది. కొన్ని సందర్భాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పరిస్థితి కూడా అధికారులకు లేదంది. హైదరాబాద్ కోఠి ప్రాంతంలో జ్ఞానశేఖర్ అనే వ్యక్తి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ముకుంద్ దాస్ సోని మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు.

