
తెలంగాణలోని అన్ని వర్శిటీల్లో డిగ్రీ, పీజీ పరీక్షలను ఇవాళ్టి(సోమవారం) నుంచి నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ఇప్పటికే అన్ని యూనివర్సిటీలు పరీక్షల తేదీలను ప్రకటించడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే.. పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.దీనికి సంబంధించి హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ వేయడానికి NSUI రాష్ట్ర అధ్యక్షుడు సోమవారం ప్రయత్నించారు. ఈ పిటిషన్ స్వీకరణకు అనుమతి కోరారు. అయితే.. దీనిపై స్పందించిన హైకోర్టు పరీక్షల అంశాన్ని అత్యవసర విచారణకు నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ రోజు(సోమవారం) ఉదయం పది గంటలకు పరీక్షలు మొదలైతే, వాయిదా వేయాలని ఇప్పుడు హైకోర్టుకు రావడం ఏంటని.. ఇన్ని రోజులు ఏం చేశారని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమయ్యాయని, ఇక దీనిపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. లంచ్మోషన్ పిటిషన్కు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది.