ఆస్ బయోటెక్ సదస్సుకు తెలంగాణకు ఆహ్వానం

ఆస్ బయోటెక్ సదస్సుకు తెలంగాణకు ఆహ్వానం
  • మన దేశం నుంచి మనదే ఏకైక రాష్ట్రం   
  • ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలో సదస్సు
  • మంత్రి శ్రీధర్​బాబుకు ఆ దేశ కాన్సుల్ జనరల్ ఇన్విటేషన్  

హైదరాబాద్, వెలుగు: ఆస్ట్రేలియాలో జరగనున్న ‘ఆస్​బయోటెక్​2025’ సదస్సులో పాల్గొనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. 21 నుంచి 24 వరకు మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్​లో నిర్వహించనున్న ఈ సదస్సుకు రావాల్సిందిగా ఐటీ మంత్రి శ్రీధర్​బాబును ఆస్ట్రేలియా కాన్సుల్​జనరల్​హిల్లరీ మెగీచీ ఆహ్వానించారు. బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ఆయనను ఆమె కలిసి ఇన్విటేషన్ అందజేశారు. ఆసియా పసిఫిక్​ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్​బయోటెక్​ ఇంటర్నేషనల్​కాన్ఫరెన్స్​’లో కీలకోపోన్యాసం చేసేందుకు మంత్రి శ్రీధర్​బాబుకు అవకాశం లభించింది.

 కాగా, రెండేండ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ‘గ్లోబల్ ఫార్మా, బయో టెక్నాలజీ, మెడ్‌‌‌‌‌‌‌‌టెక్’ ఆవిష్కరణ హబ్ గా తెలంగాణ ను తీర్చి దిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని మెగీచి ప్రత్యేకంగా అభినందించారు. 

3‘ఆస్ట్రేలియా–తెలంగాణ’ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. ‘‘ఈ ఆహ్వానం లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఏడు అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌‌‌‌‌‌‌‌లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం మనదే. ఈ రంగంలో కొత్తగా రూ.63 వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. మరిన్ని తీసుకొచ్చేందుకు ఈ వేదికను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది’’ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.