- ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న జర్మన్ కంపెనీ
- పరిశ్రమల ఏర్పాటుకు 2 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జర్మన్ ఆటోమోబైల్ కంపెనీ ‘లైట్ ఆటో’ రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. సోమవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన జర్మన్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మంత్రి కేటీఆర్, జర్మన్ అంబాసిడర్ వాల్టన్ సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే టీఎస్ఐపాస్ లాంటి చట్టం అమెరికాలోనూ లేదన్నారు. పరిపాలన సంస్కరణలతో రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు 2 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేశామన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందన్నారు. లైట్ఆటో పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా 9 వేల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 18 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. ఈ కంపెనీ కార్లు, కమర్షియల్ వెహికిల్స్, టూ వీలర్లకు సంబంధించిన మెగ్నీషియం విడిభాగాలను ఉత్పత్తి చేస్తుందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 17,500 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, ఐటీ, టెక్స్టైల్స్ సహా ఇతర పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. సమ్మిట్లో ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, పారిశ్రామికవేత్తలు అమిత్ దేశాయ్, కృష్ణస్వామి, హెన్రీ పాల్గొన్నారు.