హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళల సురక్షిత ప్రయాణానికి తీసుకొచ్చిన ‘టీ-సేఫ్’ వ్యవస్థ ఒక విప్లవాత్మక ముందడుగని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2022 ప్రకారం, భారతదేశంలో అత్యధికంగా శ్రామిక మహిళల శాతం తెలంగాణలోనే ఉన్న నేపథ్యంలో.. మహిళల సురక్షిత ప్రయాణం కోసం 2024లో ‘టీ- సేఫ్’ యాప్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ మేరకు చత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఇటీవల జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్లో ‘టీ- సేఫ్ మహిళల కోసం సురక్షిత ప్రయాణం’ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు పాల్గొన్న ఈ కాన్ఫరెన్స్ వివరాలను డీజీపీ ఆఫీసు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ట్రావెల్-సేఫ్’ లేదా ‘టీ సేఫ్’ ముఖ్య లక్షణాలలో ఒకటి దీనికి స్మార్ట్ ఫోన్ అవసరం లేకపోవడం.. ఆటోమేటెడ్ రైడ్ ట్రాకింగ్ ఫీచర్ అందుబాటులో ఉన్నాయన్నారు. విజన్ 2047 నాటికి పోలీసు విభాగంలో మహిళల నిష్పత్తిని 50శాతం వరకు పెంచాలని ప్రతిపాదించారు. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్, ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్’ను ఏడు జిల్లాల్లో ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యత, సాంకేతికత వినియోగంపై శివధర్ రెడ్డి సమగ్రంగా వివరించారు. ఈ రకమైన యాప్లను రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రారంభిస్తే బాగుంటుందని ప్రధానమంత్రి మోదీ అభిప్రాయపడ్డారని అందులో పేర్కొన్నారు.
